రామగిరి, మార్చి 7 : సింగరేణిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం మొదటి షిఫ్టులో11:35 గంటలకు ఘోర ప్రమాదం సంభవించింది. గనిలోని 86వ లెవల్, ఎల్సీ-3 వద్ద ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. సరిగ్గా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, గని డిప్యూటీ మేనేజర్ తేజ, మైనింగ్ సర్దార్ పిల్లి నరేశ్, ఆపరేటర్ జోడి వెంకటేశ్, సపోర్ట్మన్ ఎరుకల వీరయ్య, బదిలీ వర్కర్ రవీందర్తోపాటు కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. 86వ లెవల్ వద్ద దాదాపు మూడు మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో రూఫ్ వాల్ కూలడంతో కార్మికులను రక్షించేందుకు అధికారులు రెస్క్యూ టీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తోటి కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు, అధికారులంతా గనిపైకి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు మూడు గంటల అనంతరం సపోర్టుమన్ ఎరుకల వీరయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా ఐదుగురిలో ఇద్దరు కార్మికుల అరుపులు వినిపిస్తుండడంతో శిథిలాల తొలగింపును వేగిరం చేశారు. ఇదిలా ఉండగా.. సింగరేణిలోనే అత్యంత అధునాతన విదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే రంగ ప్రవేశం చేసిన రెస్క్యూటీం.. ఎనిమిది గంటల తర్వాత బొగ్గు శిథిలాల కింద చిక్కి కొన ఊపిరితో ఉన్న కార్మికులు జాడి వెంకటేశ్, నరేశ్ను సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స కోసం గోదావరిఖని ఏరియా దవాఖాకు తరలించారు. ప్రమాద స్థలంలో కార్మికులు, బాధిత కుటుంబాల సభ్యులు చేరుకున్నారు. కార్మిక కుటుంబీకుల ఆర్తనాదాలతో గని దద్దరిల్లింది. ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా.., ఏఎల్పీ గనిలో జరిగిన ఈ ప్రమాదానికి బాధ్యులైన అధికారులను వదలవద్దంటూ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. ఈ మేరకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని గనిపైకి చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న ఈ గనిలో ప్రమాదం జరగడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు.