సత్తుపల్లి, మార్చి 7 : ఆమె ఒక సాధారణ గృహిణి…సమాజానికి సేవ చేయాలనే తలంపుతో చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న ఆలోచనతో ఫుడ్బ్యాంకు స్థాపించి నిరుపేదలు, యాచకులు, అనాథలకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫుడ్బ్యాంకు నిర్వాహకురాలు పఠాన్ ఆశాఖాన్. సత్తుపల్లిలో 2014లో ఐదుగురు సభ్యులతో ఫుడ్బ్యాంకు ఏర్పాటు చేశారు. తన ఇంట్లోనే వంట చేసి పట్టణంలోని యాచకులు, వృద్ధులు, అనాథలకు ఉదయం, సాయంత్రం భోజనం అందిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, హోం ఐసొలేషన్లో ఉన్నవారికి పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు 100 రోజుల పాటు అందించి పలువురి ప్రశంసలు పొందారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, దాతల సహకారంతో పట్టణ, మండల పరిధిలో కరోనా బాధితులకు సేవలందించారు. కరోనా సమయంలో మృతి చెందిన వ్యక్తులకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ రాకపోవడంతో ఆశాఖాన్ తన బృందంతో కలిసి 15 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో మతిస్థిమితం లేని వారిని చేరదీసి ఆసుపత్రిలో చేర్చి సపర్యలు చేసిన ఘనత కూడా ఆమెదే. ఏడేళ్ల నుంచి ఇప్పటివరకు లక్ష మందికి పైగా భోజనం, సాయం చేసిన ఘనత ఆశాఖాన్కే దక్కింది. ఆశాఖాన్ సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులు ప్రకటించాయి.
సేవ చేయడంలోనే సంతృప్తి ..
నిరుపేదలకు సేవ చేయడమే సంతృప్తి కలిగించింది. కరోనా కష్టకాలంలో వారికి అండగా నిలవడంతో నా జీవితానికి సార్థకత దక్కింది. అనాథ శవాలకు అన్నీతానై అంత్యక్రియలు చేసినప్పుడు ఎంతో సంతృప్తి కలిగింది. చివరి వరకూ ఇదే సేవలో కొనసాగుతా…
– పటాన్ ఆశాఖాన్, ఫుడ్బ్యాంకు నిర్వాహకురాలు