కల్లూరు, సెప్టెంబర్ 17: కల్లూరు మేజర్ పంచాయతీని త్వరలోనే మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ నిర్మాణానికి బదులుగా నూతన భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. కల్లూరులో పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కల్లూరులో బస్టాండ్ లేక ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. మేజర్ పంచాయతీ, దాతల నుంచి నిధులు సేకరించి బస్టాండ్ నిర్మించడం అభినందనీయమన్నారు. దీనికి ఎమ్మెల్యే సండ్ర కూడా రూ.10 లక్షల నిధులు కేటాయించి ఎంతగానో కృషిచేశారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ప్రయాణికులపై భారం మోపాయని విమర్శించారు. కానీ తెలంగాణ మాత్రం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వమే ఆర్టీసీని నడుపుతోందని, ప్రయాణికులపై చార్జీల భారం కూడా మోపలేదని మంత్రి స్పష్టం చేశారు.
కల్లూరు అభివృద్ధికి కృషి : సండ్ర
కల్లూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషిచేస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 1975 ప్రాంతంలో నిర్మించిన ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో రూ.10.50 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల ప్రాంగణం ఏర్పాటుకు సహకరించిన మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్కినేని నీరజారఘును మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్కరించారు. అదేవిధంగా మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సండ్ర కూడా సర్పంచ్ దంపతులను, దాతలను శాలువాతో సత్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సూర్యనారాయణ, భవానీప్రసాద్, రాజ్యలక్ష్మి, హేమలత, శంకర్రావు, వెంకటేశ్వరరావు, బాబ్జీ ప్రసాద్, రవికుమార్, బీరవల్లి రఘు, కట్టా అజయ్కుమార్, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, కొరకొప్పు ప్రసాద్, పెడకంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.