భద్రాచలం, ఫిబ్రవరి11: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో శుక్రవారం అఖల పక్ష నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ధర్నా నిర్వహించారు. వంటావార్పు చేపట్టారు. రహదారులపై సహపంక్తి భోజనం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహన రాకపోకలను అడ్డుకున్నారు. భద్రాచలం పట్టణలోని బ్రిడ్జి సెంటర్, కూనవరం రోడ్డు, గోళ్లగట్ట రోడ్డు, చర్ల రోడ్డులో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రాస్తారోకో చేశారు. పోలీసులు కొందరు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు రెండు గంటల తర్వాత ఆందోళనకారులను పోలీసులు తిరిగి విడుదల చేశారు. తోపులాటలో ఇద్దరు సీపీఐ నాయకులకు గాయాలయ్యాయి. ధర్నాలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఐదు పంచాయతీలను ఏపీలో కలపడంతో భద్రాచలం పట్టణం ఏకాకి అయిందన్నారు. ఈ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంన్నారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆ పంచాయతీలను తెలంగాణలో కలుపుతూ స్పెషల్ ఆర్డినెన్స్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య నాయకులు పాల్గొన్నారు.