కొత్తగూడెం క్రైం/మామిళ్లగూడెం, ఆగస్టు 8: ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని 17 కేంద్రాల్లో 7,932 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,358 మంది హాజరయ్యారు. సత్తుపల్లిలోని 13 కేంద్రాల్లో 5,304 మంది అభ్యర్థులకు 4,704 మంది హాజరయ్యారు. భద్రాద్రి జిల్లాలోని 21 కేంద్రాల్లో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కొత్తగూడెం-పాల్వంచలోని 14 పరీక్షా కేంద్రాల్లో 6,108 మంది, భద్రాచలంలోని 7 పరీక్షా కేంద్రాల్లో 2,044 మంది పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా 8,152 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7,383 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలైంది. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖమ్మం నగరంలోని కవిత డిగ్రీ కళాశాల, మ్యాక్స్ ఫార్మసీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాలను సీపీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యంగా కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. భద్రాద్రి ఎస్పీ వినీత్, పరీక్షల నోడల్ అధికారి ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు, రీజినల్ కో-ఆర్డినేటర్స్ పున్నం చందర్, భద్రయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు, డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్బాబు, ఏఆర్ డీఎస్పీ కేవీఆర్ సత్యనారాయణ బందోబస్తును పర్యవేక్షించారు.