ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 8 : పాఠశాల విద్యలో పదో తరగతి చివరి దశ.. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సమగ్ర వివరాలతో కూడిన సర్టిఫికెట్ అందుకోవడం కీలకం. ఇంటర్మీడియేట్తోపాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు పదోతరగతి మార్కుల జాబితానే ప్రామాణికం. ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల వివరాలను సమగ్రంగా ప్రభుత్వానికి పంపించే బాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలపై ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులూ తమ పిల్లల వ్యక్తిగత వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో తప్పులు లేకుండా అప్లోడ్ చేశారో లేదో ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉంది.
మార్చి, ఏప్రిల్లో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 418 పాఠశాలల నుంచి నుంచి 20 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్షలకు ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తిగత వివరాలు (పేరు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జననం తేదీ), చైల్డ్ఇన్ఫోతో సరిచూసుకుని నామినల్ రోల్స్లో తప్పులు లేకుండా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశించింది.
పదో తరగతి మార్కుల మెమోలో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు తప్పుగా దోర్లితే వాటిని తిరిగి సవరించుకోవడం సాధారణ విషయం కాదు. ఇందుకు ప్రాసెస్ సుదీర్ఘంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుల్లో ఎలా అయితే పేరు ఉంటుందో ఇంగ్లిష్ అక్షరాలను అదేవిధంగా నమోదు చేయాలి. ఇందులో ఒక్క అక్షరం తప్పు వచ్చినా భవిష్యత్లో ఉన్నత చదువులు, పాస్పోర్టు, వీసాలు జారీ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సర్టిఫికెట్లో తప్పులు దోర్లిన తర్వాత వాటిని సవరించుకునేందుకు విద్యార్థి చదివిన పాఠశాల నుంచి ప్రారంభించి ఎన్నో ధ్రువపత్రాలు, అఫిడవిట్లు సిద్ధం చేసుకుని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో సమర్పించి అక్కడి నుంచి పొందాల్సి ఉంటుంది.
పదో తరగతి పరీక్షల ఫీజును ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం ఉంది. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 24తేదీ వరకు, రూ.200ల అపరాధ రుసుంతో మార్చి 4 తేదీ వరకు, రూ.500ల అపరాధ రుసుంతో మార్చి 14వ తేదీ వరకు గడువు ఉంది.
పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ప్రస్తుతం ఫీజుల చెల్లింపు హడావుడి నెలకొంది. ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో యాజమాన్యాలు విద్యార్థుల సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు. నామినల్ రోల్స్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను హార్డ్కాపీ ఎంఈవోలతో వెరిఫై చేయించి డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంది. పాఠశాల యాజమాన్యాలు తప్పకుండా పై నియమాలు పాటించాలి.