ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 21: వచ్చే ఏడాదిలో ఉద్యాన సాగు పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంబంధిత అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మిశ్రమ నేలలు కలిగి ఉన్న ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం నల్లరేగడి భూముల్లో మిర్చి, పత్తి సాగవుతున్నది. ఎర్రనేలలు, కలిగిన భూముల్లో కూరగాయలతోపాటు అపరాల సాగు చేస్తున్నారు. ఆయకట్టు ప్రాంతంలో మాగాణి, మెట్ట భూములున్నా.. అచ్చుకట్టి భూములను ఆ ప్రాంత రైతులు వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ యాసంగి నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు.
రైతు పప్పులను కొనే పరిస్థితి..
ఆశించిన మేర అపరాల సాగు జరగకపోవడం.. వరి, వాణిజ్య సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవడంతో ప్రతి రైతు పప్పు ధాన్యాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. వరి సాగుతోపాటు పునాస పంటల సాగు చేపడితే కుటుంబ అవసరాలు పోను జిల్లావాసులకు అనువైన ధరల్లో పప్పు ధాన్యాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఒకే రకమైన పంటను అందరూ పండించడం ద్వారా ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వరికి బదులు, వాణిజ్య పంటలు, పునాస (అపరాల) సాగు చేపట్టడంతోనే మంచి లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు పరిశీలిస్తే అపరాలు (కంది, పెసర) పంటల సాగుకు అనువుగా ఉంది. ఖమ్మం జిల్లాలోనే తెలంగాణ రైతులకు సరిపడా విత్తనోత్పత్తి జరగడం విశేషం. నల్లరేగడి, దుబ్బనేలలు, ఎర్రమట్టి నేలల మిశ్రమం జిల్లా సాగు భూముల సొంతం. పునాస పంటల సాగుతో అనేక లాభాలు ఉన్నాయి.
మూడు రకాల పంటలకూ అనువుగా చెలకలు
ఏటా ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల పంటల సాగుకు చెలకలు అనువుగా ఉండేవి. పది గుంటల భూమిలో సైతం పది రకాల కూరగాయలు పండించేది. వానకాలం సీజన్లో పెసర పంటలో అంతర్ పంటగా కంది సాగు చేస్తే ఆరునెలల వ్యవధిలో రెండురకాల పంటలు పండించిన చరిత్ర చెలక భూములకు ఉంది. సాగు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయనే ఉద్దేశంతో వరి సాగు చేయడంతో చెలక భూములు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి.
బహుళ పంటల సాగుతో ప్రయోజనాలు
ఒకే పొలంలో, ఒకే అదునులో, ఒక క్రమ పద్ధతిలో నిర్ధిష్టమైన నిష్పత్తిలో సాగు చేయడంతో అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కోసారి మూడు పంటలనూ సాగు చేసేది. దీనినే మిశ్రమ సాగు అంటారు. అంతర్ పంటల సాగులో ఒకటి ప్రధాన పంట అయితే మరొకటి అంతర్ పంట అవుతుంది. అంతర్ పంటల సాగుతో అనేక ప్రయోజనాలున్నాయి. ఒకే సారి రెండు పంటలను దిగుబడి చేసుకునే వీలుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఒక పంట అయినా చేతికొచ్చే అవకాశం ఉంది. పప్పుజాతి పైర్లు వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. భూమిలోని అన్ని పొరలకు సంబంధించి తేమను, సారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్రధాన పంటలపై ఆశించే చీడపీడలను కొంతమేర అరిట్టవచ్చు. తద్వారా మిత్ర పురుగుల వృద్ధికి అవకాశం ఉంటుంది.
చిరుధాన్యాలకు పెరిగిన డిమాండ్
జిల్లాలో చిరుధాన్యాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 7వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. రఘునాథపాలెం, ఏన్కూరు, కామేపల్లి, కూసుమంచి మండలాల్లో ఈ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ పలుకుతుండడంతో మరోసారి ఈ సాగుపై రైతులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
బహుళ పంటల సాగుకు వ్యవసాయశాఖ సమాయత్తం
వచ్చే యాసంగి సీజన్ నుంచి బహుళ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. సత్తుపల్లి, కొణిజర్ల, కల్లూరు తదితర మండలాల్లో ఆయిల్పామ్ సాగు విస్తరణపై అధికారులు దృష్టిసారించారు. యాసంగి సీజన్లో అనువైన నూనెగింజల, వేరుశనగ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. పెసర, పొద్దుతిరుగుడు, చిరుధాన్యల సాగుకు అనువైన నేలలను గుర్తించే పనిలో విస్తరణ అధికారులు నిమగ్నమయ్యారు.