భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 691 చెరువుల్లో ప్రతి ఏటా కోటికి పైగా చేపపిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పోస్తున్నది. చేపల విక్రయానికి మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను సైతం అందిస్తున్నది. దీంతో ఏటా చేపల వేట జాతరలా కొనసాగుతున్నది. మత్స్యకారులతోపాటు గిరిజనులకు కూడా ఉపాధి కల్పించేందుకు వారికి కూడా సొసైటీల్లో సభ్యత్వం ఇచ్చి చేపల వేటలో నైపుణ్యాన్ని కల్పిస్తున్నది.
నాడు చెరువుల్లో పిచ్చిరొట్ట..
అప్పుడు చెరువుల్లో అంతా పిచ్చిరొట్ట, గుర్రపుడొక్క, అల్లుకునే తీగ నిండి ఉండి చేపల పెంపకానికి అనుకూలంగా ఉండేవి కావు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను శుభ్రం చేయడంతో అటు రైతులు, ఇటు మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఒకప్పుడు చేపలు తినాలంటే ఆంధ్రా నుంచి వచ్చే వాటికోసం వేచి చూసే వాళ్లం. తిరువూరు, విజయవాడ, కాకినాడ నుంచి ఐస్బాక్స్లో వస్తే తప్ప మనం చేపలు తినే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చాక సీన్ మారింది. మన మత్య్ససంపద మన దగ్గరే తయారవుతున్నది. ఇప్పుడు మన చెరువుల్లో ఎదిగిన చేపలనే మనం తినే రోజులు వచ్చాయి. ఐదేళ్లుగా మన ఊరు చెరువులో పెరిగిన చేపలనే తింటున్నాం.
సత్ఫలితాన్నిస్తున్న కార్యాచరణ
చేప పిల్లలను పెంచడంతో పాటు వాటిపై ఆదాయం పొందేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తున్నది. గతేడాది జిల్లాలో 691 చెరువుల్లో 1.78లక్షల చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. ఇందులో 654 సీజనల్ చెరువులు ఉండగా 34 చెరువుల్లో శాశ్వత నీరు ఉండే చెరువులు ఉన్నాయి. ఇవేకాక మూడు రిజర్వాయల్లో కూడా చేపలు పెరుగుతున్నాయి. ఏటా మత్స్యకారుల కుటుంబాలకు 20 నుంచి 30వేల రూపాయల ఆదాయం సమకూరుతున్నది. ప్రతి సభ్యుడికి వేటలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగుపరుస్తున్నారు.
బలోపేతమవుతున్న సొసైటీలు
నాడు ఇద్దరు ముగ్గురికే పరిమితమైన మత్స్యకారులు నేడు సొసైటీ ఏర్పాటుతో బలోపేతమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 56 సొసైటీలను ఏర్పాటు చేసుకున్నారు. 2,686 సభ్యులు ఈ సొసైటీల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. గిరిజనులు కూడా ఇందులో సభ్యులుగా ఉండి చేపల విక్రయాలతోపాటు పెంపకంలో భాగస్వామ్యులవుతున్నారు. గిరిజన, గిరిజనేతరులు కలిసి ఐక్యంగా సొసైటీలను ఏర్పాటు చేసుకుని ఏటా సభ్యత్వాన్ని పెంచుకుంటున్నారు.
మా చెరువు చాలా పెద్దది
కారుకొండ చెరువు చాలా పెద్దది. ఎక్కువ చేపలు పెరుగుతాయి. గతంలో నేను వ్యవసాయం చేసేవాడిని. చేపల సొసైటీలో చేరాక ఆదాయం పెరిగింది. ఎన్నికలు పెట్టుకున్నాం. నేను సొసైటీ చైర్మన్ అయ్యాను. వ్యాపారం చేసుకుంటున్నాం. చేపలు కిలో నుంచి రెండు కిలోలు పెరిగాయి. సభ్యులందరం కలిసి చేపల వేట చేస్తుండడంతో మంచి ఆదాయం వస్తోంది.
మంచి ఆదాయం వస్తున్నది
ప్రభుత్వం చెరువులు బాగు చేసింది. చేపపిల్లలను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు కూలీకి పోకుండానే మాకు మంచి ఆదాయం వస్తున్నది. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
రొయ్యలు కూడా ఇచ్చాం
ఏటా చేపపిల్లలతోపాటు రొయ్యలు కూడా ఇస్తున్నాం. జిల్లాలో మూడు ప్రాజెక్టులు దోమలవాగు ప్రాజెక్టు, పేరంటాల చెరువు, ఎర్రవాగులో రొయ్యలు ఇచ్చాం. దిగుబడి బాగుంది. ఈ నెలలో చెరువుల్లో మళ్లీ చేపపిల్లలు వేయడానికి సిద్ధం చేశాం.