దళిత బంధు పథకం కింద త్వరలో చింతకాని మండలానికి రూ.450 కోట్లు రానున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ.గౌతమ్తో కలిసి ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత కుటుంబాల అభివృద్ధి, అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాజకీయాలకు తావులేకుండా ప్రతి దళిత కుటుంబానికి దళితబంధును అందజేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. కొత్తగా వివాహం చేసుకుని కుటుంబాలుగా ఏర్పడిన దళితులకూ ఈ పథకం వర్తింపజేస్తామని, రేషన్కార్డు ఉండాలన్న నిబంధన ఏమీలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మది నుంచి ఉద్భవించిన దళిత బంధు పథకం దేశాన్నే మలుపు తిప్పబోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ర్టాలనూ ఆలోచింపజేస్తున్నదని పేర్కొన్నారు.
ఖమ్మం, సెప్టెంబరు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళిత బంధు పథకం కింద త్వరలో చింతకాని మండలానికి రూ.450 కోట్లు రానున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ.గౌతమ్తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత కుటుంబాల అభివృద్ధి, అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాజకీయాలకు తావులేకుండా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధును అందజేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాలో దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి అందేలా కృషి చేస్తామన్నారు. చింతకాని మండలంలో 4,500 దళిత కుటుంబాలు ఉంటాయని భావిస్తున్నామని, కొత్తగా వివాహం చేసుకొని కుటుంబాలుగా ఏర్పడిన దళితులకు ఈ పథకం వర్తింపజేస్తామని, రేషన్కార్డు కలిగి ఉండాలన్న నిబంధన ఏమీలేదని ఆయన చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ప్రస్తుతం 4,312 కుటుంబాలు ఉన్నాయని వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
చింతకాని మండలంలోనే అధికంగా దళిత కుటుంబాలు
మధిర నియోజకవర్గంలో చింతకాని మండలంలోనే దళిత కుటుంబాలు అధికంగా ఉండడంతోనే పైలట్ ప్రాజెక్టుగా మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. దళితులకు దళిత బంధు వర్తింపజేసేందుకు గ్రామస్థాయిలో కార్యాచరణ ప్రారంభించామని, ప్రతి గ్రామానికి ఒక జిల్లా స్థాయి అధికారిని క్లస్టర్ అధికారిగా నియమించనున్నామని, రాబోయే రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో ఈ క్లస్టర్ అధికారులు పనిచేస్తారని చెప్పారు. దళితులకు దళితబంధుపై అవగాహన, నైతిక మద్ధతు ఇచ్చేందుకు గ్రామ, మండలస్థాయిల్లో దళితులతో కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామకమిటీలో ఆరుగురు దళితులు, అందులో ముగ్గురు మహిళలు ఉంటారని, మండలస్థాయిలో 15 మందితో దళిత కమిటీ ఉంటుందని, అందులో 50 శాతం మహిళలు ఉంటారని మంత్రి వివరించారు.
ఏ వ్యాపారం చేసుకోవాలన్నది వారి ఇష్టం
దళిత బంధు పథకం కింద లబ్ధిపొందిన దళితులు ఏ వ్యాపారం చేసుకోవాలన్నది వారి ఇష్టమేనని, వారిపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. వారు వ్యాపారం చేసే యూనిట్ మాత్రం కలెక్టర్ పర్యవేక్షిస్తారని చెప్పారు. దళితబంధు కోసం కుటుంబాల్లో ఒకరి పేరుతో బ్యాంకులో అకౌంట్ ప్రారంభించనున్నామని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. దళిత బంధుకు సంబంధించి కలెక్టర్ అకౌంట్లో రూ.450 కోట్లు జమకానున్నాయని పేర్కొన్నారు. దళితబంధులో లబ్ధిదారుడి అకౌంట్కు నేరుగా రూ.9.90 లక్షలు జమ అవుతాయని, రూ.10 వేలు మండలస్థాయిలో ఏర్పాటు చేసే దళిత రక్షణ నిధిలో జమ చేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడి పేరిట మరో రూ.10 వేలను ప్రభుత్వం దళిత రక్షణ నిధిలో జమ చేస్తామని చెప్పారు. దళితబంధును రాజకీయాలకు అతీతంగా ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూస్తామని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకానిని ఎంపిక చేయడంతోనే దళితబంధు రాజకీయాలకు అతీతమన్న విషయం ప్రజలకు స్పష్టమైందని మంత్రి అన్నారు.
కలెక్టర్ వీపీ.గౌతమ్ మాట్లాడుతూ దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామన్నారు. గ్రామస్థాయిలో అధికారులను నియమించడంతోపాటు దళితబంధు విధి, విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ దశాబ్దాలుగా అణచివేతకు గురైన దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకోవడం అభినందనీయమన్నారు. చింతకాని మండలంలోని దళితవాడల అభివృద్ధికి కావాల్సిన నిధులను, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.30 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారని, ఆ నిధులు మంజూరైతే దళితవాడల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, హుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.