మణుగూరు రూరల్, సెప్టెంబర్ 14: దేశంలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్కు మణుగూరు మండలం పగిడేరు గ్రామం వేదిక కాబోతుంది. రూ.1.73 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్గా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్కు సింగరేణి ఆధ్వర్యంలో స్థల సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం సింగరేణి ఉన్నతాధికారుల బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకిన్ సైకిల్ (ఓఆర్సీ) టెక్నాలజీతో రూపుదిద్దుకోబోతున్న జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్ను శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, న్యూఢిల్లీ, సింగరేణి మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
జియో థర్మల్ ఏర్పాటుకు స్థల పరిశీలన…
సింగరేణి కాలరీస్, శ్రీరాం ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) సంయుక్త నిర్మాణంలో ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రతిపాదిత ప్రాంతాన్ని సింగరేణి కార్పొరేట్ జీఎం(ఏస్టేట్స్) ఎం. సుభానీ, ఏరియా జీఎం రమేశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ సారథ్యంలో సింగరేణి సంస్థ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగంలోనూ తన ప్రతిభ చాటుతుందనడానికి జియోథర్మల్ గొప్ప ఉదాహరణ అన్నారు. 20 కేడబ్ల్యూ నుంచి 100 కేడబ్ల్యూ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిర్థారించినట్లు తెలిపారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను సింగరేణి అందిస్తుందని తెలిపారు. ఏరియా జీఎం జక్కం రమేశ్ మాట్లాడుతూ.. జియో థర్మల్ వల్ల ప్రజలకు ఎటువంటి హానీ జరగదన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ప్రత్యేకతను చాటుకుంటున్న మణుగూరులో జియోథర్మల్ కేంద్ర నిర్మాణానికి అంకుర్పారణ జరగడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కనకయ్య, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఉషాశ్రీ, నర్సింహస్వామి, వెంకటేశ్వరరావు, శ్రీరాం ఇన్స్టిట్యూట్ రీసెర్చ్(న్యూఢిల్లీ) బృందం మన్మోహన్కుమార్, రూపేశ్శర్మ, హేమంత్ గుప్తా, సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్ తదితరులు ఉన్నారు.
అసలేంటీ ? ఈ జియోథర్మల్?
జియోలాజికల్ సర్వే (జీఎస్ఐ) విభాగం చేస్తున్న బొగ్గు అన్వేషణలో భాగంగా మండలంలోని పగిడేరు గ్రామం గొల్లకొత్తూరులో మూడు రంధ్రాలు చేసింది. మణుగూరు (ఎంజీఆర్) 07 (450-500 లీటర్లు నిమిషానికి), ఎంజీఆర్ 4(800 లీటర్లు నిమిషానికి), ఎంజీఆర్ 3 (690 లీటర్లు నిమిషానికి) వస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఎంజీఆర్ 4 రంధ్రం నుంచి 68.1 ఉష్ణోగ్రతతో నిమిషానికి 800 లీటర్ల నీరు భూమి నుంచి ఎటువంటి మోటార్ సాయం లేకుండా ఉబికి వస్తున్నాయి. ఈ ఆసహజ సిద్ధ వేడి నీటి ఆవిరితో (ఓఆర్సీ) పరిజ్ఞానంతో 20 కిలోవాట్ల విద్యుదుత్పత్తి చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ జియోథర్మల్ ప్రాజెక్ట్ చేపట్టనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.