వేంసూరు, మే 21 : రైతు రచ్చబండ పేరుతో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం లచ్చన్నగూడెం సొసైటీ పరిధిలోని మర్లపాడు డీసీసీబీ కేంద్రం వద్ద రైతులకు సబ్పిడీపై జీలుగు విత్తనాల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇన్నేళ్లుగా ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, టీఆర్ఎస్ పాలనలో ఏవిధంగా ఉందో రైతులు గమనించాలన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతాంగానికి 24గంటల కరెంటు ఇవ్వడంతో పాటు సీతారామ ప్రాజెక్టు ద్వారా రానున్న రోజుల్లో వ్యవసాయ రంగానికి జిల్లాకు పుష్కలంగా సాగు నీరందించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. కొందరి స్వార్ధ రాజకీయాల కోసం రచ్చబండ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతులు తెలంగాణలో వ్యవసాయానికి ఏ విధమైన నిధులు, అభివృద్ధి చేస్తున్నారో గమనించాలన్నారు. అన్ని చెరువులకు నీరందించడంతో పాటు వ్యవసాయ పెట్టుబడికి రూ.50 వేల కోట్ల రూపాయలు చెల్లించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని, అది ఒక్క తెలంగాణకే దక్కుతుందన్నారు.
వేంసూరు మండలంలోని కల్లూరుగూడెంలో సుమారు 42ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఆయిల్ ఫెడ్ సంస్థ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెల్ది జగన్మోహన్రావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, సీడీసీ డైరెక్టర్ శంకర్రెడ్డి, సొసైటీ చైర్మన్లు సోమిరెడ్డి, శ్రీనివాసరావు, సర్పంచ్ మందపాటి వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, ఏవో రామ్మోహన్రావు, ఏఈవోలు, మండల నాయకులు పాల్గొన్నారు.