పల్లె, పట్టణాల్లో ‘ప్రగతి’ కాంతులు విరజిమ్ముతున్నాయి. సమస్యలతో కొట్టుమిట్టాడిన గ్రామాల్లో అభివృద్ధి జాడలు కనిపిస్తున్నాయి. గతుకుల దారులన్నీ.. సీసీ రోడ్లతో దర్శనమిస్తున్నాయి. చెత్తాచెదారం, పారిశుధ్య చర్యలు చేపట్టేవారు లేక కునారిల్లిన పల్లె, పట్నాలు నేడు స్వచ్ఛత దిశగా అడుగేస్తున్నాయి. అంటువ్యాధులు, రోగాలు దూరమయ్యాయి. పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. ఊరూరా ఆఖరి మజిలీ కష్టాలను తీర్చేందుకు వైకుంఠధామాలు వెలిశాయి. అంధకారంతో అలమటించిన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లె, పట్టణ ప్రగతి’ కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చేసింది. ఇంతకుముందు పైసా నిధులు రాని పంచాయతీలకు ఇప్పుడు ప్రతి నెలా సుమారు రూ.30 కోట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం ఐదో విడత కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.
ఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చివేశాయి. అభివృద్ధి లేక ఒకప్పుడు దుర్భరంగా ఉన్న పల్లెలు, పట్టణాలు సకల సౌకర్యాలతో ఇప్పుడు వికరిస్తున్నాయి. సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు మొదలుకొని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల వరకూ అన్నింటా కాంతులు వెదజల్లుతున్నాయి. ఇంతకుముందు పైసా నిధులు రాని పంచాయతీలకు ఇప్పుడు ప్రతి నెలా ఏకంగా సుమారు రూ.30 కోట్లు వస్తున్నాయి. వీటితో పారిశుధ్య పను లు పక్కాగా జరుగుతుండడంతో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల జాడ లేకుండా పోయింది. దీంతో నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ఇదే స్ఫూర్తితో ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాం గం ఐదో విడత కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.
పట్టణ ప్రగతితో సిటీలకే కొత్త హంగులు
పల్లెప్రగతితో పాటు పట్టణ ప్రగతికి కూడా కార్యరూపం దాల్చిన ప్రభుత్వం స్వచ్ఛ పట్టణాలుగా మార్చివేసింది. క్లీనింగ్ పరికరాలను అందుబాటులోకి తీసుకు వచ్చి వార్డుకు ఒక డంపింగ్ వ్యాన్ను ఇవ్వడంతో వార్డుల్లో మురికి కూపాలు అడ్రస్ లేకుండా పోయాయి. పట్టణ పార్క్లు,ఓపెన్ జిమ్లు,చిట్టడవులను పెంచి పట్టణాలకు కొత్తందాలను తెచ్చిపెట్టారు. స్వచ్ఛభారత్లో భాగంగా మున్సిపాలిటీల పరిదిలో జిల్లా వ్యాప్తంగా కూడలి ప్రాంతాల్లో సంతలు జరిగే ప్రదేశాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో శానిటేషన్లో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఇల్లందు,కొత్తగూడెం,మణుగూరు,పాల్వంచ మున్సిపాలిటీల్లో డివైడర్లను ఏర్పాటు చేసి పూలమొక్కలను పెంచారు.అన్ని జాతీయ రహదారులకు ఎల్ఈడీ లైట్లను అమర్చి రాత్రులు పట్టపగలులా కనిపించేలా లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
పల్లె వికాసం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీలతోపాటు ఇప్పటికే ఉన్న గ్రామ పంచాయతీలకు జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటితో ప్రధానంగా 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో గుర్తించిన పనులకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎస్ఎఫ్సీ ద్వారా ఖమ్మం జిల్లాలోని పంచాయతీల ఖాతాలకు రూ.14.50 కోట్లు, భద్రాద్రి జిల్లాలోని ఖాతాలకు రూ.15 కోట్లు విడుదల చేస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 589 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 14వ ఫైనాన్స్ కార్పొరేషన్, పీఎంఏజీవై (ఎసీఎస్పీ) వంటి పథకాలతో నిధులు వెచ్చిస్తోంది. ఈ నిధులతో 589 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. గ్రామాల్లో వినియోగంలో లేని 304 బోర్ వెల్స్ను, 530 బావులను పూడ్చి వేశారు. ప్రతి గ్రామంలో నర్సరీల పెంపకం ద్వారా 2 కోట్ల మొక్కల పెంపకానికి కసరత్తు చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాలు 22, పంచాయతీలు 481 ఉన్నాయి. పంచాయతీ కార్మికులు 1,633 మంది పనిచేస్తున్నారు. పల్లెప్రకృతి వనాలు 1,280, ట్రాక్టర్లు ట్యాంకర్లు 960 ఉన్నాయి. డంపింగ్ యార్డులు 481, వైకుంఠధామాలు 481, నర్సరీలు 481, బృహత్ పల్లెప్రకృతి వనాలు 22 ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.15 కోట్లను విడుదల చేస్తోంది.
పట్టణాల్లో..
భద్రాద్రి జిల్లాలోని పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డుల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారానికి 14వ ఆర్థిక సంఘం నిధులు 1.30 కోట్లను వెచ్చించారు. బృహత్ ప్రకృతి వనానికి రూ.30 లక్షలు, రహదారులు,డ్రైనేజీలకు రూ.10 లక్షలు. అవెన్యూ ప్లాంటేషన్కు రూ.30 లక్షలు, రైజింగ్ నర్సరీలకు రూ.5 లక్షలు నిధులు వెచ్చించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం రూ.90 లక్షలతో 20 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డుల కోసం 36 చెత్త ఆటోలను కొనుగోలు చేశారు. 182 కిలోమీటర్ల పొడవునా డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టి పట్టణంలో మురుగు లేకుండా చేశారు. 8,203 మొక్కలను రహదారుల పక్కన నాటారు. స్వీపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.2 కోట్లను వెచ్చించారు. రూ.2 కోట్లతో 8 ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. వార్డుల్లో కొత్త రహదారుల నిర్మాణానికి రూ.1.80 కోట్లను కేటాయించారు. రూ.1.5 కోట్లతో తడి చెత్త,పొడి చెత్తను వేరు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రూ.20 లక్షలు వెచ్చించారు. పాల్వంచలో 25 వార్డుల్లో పట్ణణ ప్రగతి నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం రూ.5 కోట్లతో సీసీ రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. చెత్త తరలించడానికి ఆటోలను కొనుగోలు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం నగరంలో రూ.9 కోట్లతో పట్టణ ప్రగతి పనులు జరిగాయి. నగరంలో 43 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. గోళ్లపాడు ఛానల్పై మరో 15 చోట్ల పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 154 అవెన్యూ ప్లాంటేషన్లును ఏర్పాటు చేశారు. లకారంపైనా, ఎన్ఎస్పీ వాక్వేపైనా మినీ ట్యాంక్బండ్లు ఏర్పాటు చేశారు. కాల్వొడ్డు, బల్లెపల్లి, ప్రకాశ్నగర్ వైకుంఠధామాలను నిర్మించారు. వాటి వద్ద కమ్యూనిటీ ప్లాంటేషన్లను ఏర్పాటు చేశారు. ఇందిరానగర్ – టేకులపల్లి మధ్య రూ.70 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించారు. రూ.కోటి 30 లక్షలతో కొత్త బస్టాండ్, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ వద్ద మంచినీటి సౌకర్యం పనులు నిర్వహించారు. టీటీడీ ఫంక్షన్ హాల్ వద్ద రూ.20 లక్షలతో వీధివ్యాపారులకు షెడ్లను నిర్మించారు. దానవాయిగూడెం వద్ద రూ.13 లక్షలతో, ఎంపీడీవో కార్యాలయం వద్ద రూ.10 లక్షలతో, ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం సమీపంలో రూ.9 లక్షలతో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. రూ.14.84 కోట్లతో వివిధ పనులకు అంచనాలు రూపొందించగా వీటిలో చేపట్టిన 144 పనులకు గాను రూ.8.99 కోట్లను చెల్లించారు.
‘పట్టణ ప్రగతి’ చాలా మంచి కార్యక్రమం
పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా మంచిది. అనేక సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలకు ఈ కార్యక్రమం ద్వారా మోక్షం లభించింది. నేను కూడా నా డివిజన్లో కొన్ని పనులు చేపట్టాను. టెండర్లు పిలిస్తేనే పనులు చేపట్టాలనే నిబంధన కొన్నింటికి ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి. అలాంటి వాటికి పట్టణ ప్రగతి కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమం వల్ల ముఖ్యంగా పారిశుధ్యం ఎంతో మెరుగుపడింది. సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.
– బిజీ క్లెయిమెంట్, కేఎంసీ కార్పొరేటర్
పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
ఐదో విడత పల్లెప్రగతిలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మురుగు కాల్వల్లో పూడిక తొలిగింపు, వీధుల్లో, ఇళ్ల మధ్యలో ఉన్న పాత బావులు పూడ్చివేత వంటి పనులు చేపడతాం. గ్రామాల్లో వంగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో ఒక రోజు శ్రమదాన కార్యక్రమం నిర్వహించి పారిశుధ్య పనులు చేపడతాం. వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర అంశాలపై గ్రామస్తుల్లో అవగాహన కల్పిస్తాం. ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు రోజూ ఒక అంశంపై కార్యక్రమాలను చేపడతాం.
-బోడ మంగీలాల్, ఎంపీపీ, తిరుమలాయపాలెం
పట్టణ ప్రగతితో మారిన ఖమ్మం రూపురేఖలు
తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. రోజురోజుకూ పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక సదుయాలను కల్పించాం. పారిశుధ్యం మెరుగుర్చే ఉద్దేశంతో పట్టణ ప్రణాళిక పనులను చేపట్టాం. దీనివల్ల ఖమ్మం కార్పొరేషన్లో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. పాత విద్యుత్ స్తంభాలను, వేలాడే విద్యుత్ స్తంభాలను తొలిగించి వాటి స్థానాల్లో కొత్త వాటిని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఖమ్మంలో రోడ్లపైన ఒక్క స్తంభం కూడా లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా ఏమైనా పనులుంటే తదుపరి పట్టణ ప్రగతిలో చేపడతాం.
-పునుకొల్లు నీరజ, ఖమ్మం మేయర్
పట్టణ ప్రగతి ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు..
ఖమ్మం నగరంలోని నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో ఏటా విభిన్నమైన పనులు చేపడుతున్నాం. పది రోజులపాటు నగరంలో ప్రత్యేక వాతావరణం ఏర్పడుతోంది. గత ఏడాది హరితహారం కింద విరివిగా మొక్కలు నాటాం. వంగిన విద్యుత్ స్తంభాలను తొలగించాం. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చివేశాం. పారిశుధ్య పనులను నిరంతం చేపడుతున్నాం. దీని వల్ల నగరంలో దోమల బెడద లేదు. ఫలితంగా డెంగీ కేసులూ కనుమరుగయ్యాయి. ఇవే కాకుండా పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం. వీధివ్యాపారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాం. ఈ ఏడాది కూడా పట్టణ ప్రగతి ద్వారా చాలా కార్యక్రమాలు చేపడతాం.
– ఆదర్శ్ సురభి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్
దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగరంలో గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలిగింది. తద్వారా ఖమ్మం నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపడింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దూరదృష్టి కారణంగా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రజలకు సౌకర్యవంతమైన సదుపాలయాలు కల్పించాం. ముఖ్యంగా పారిశుధ్య పనులను నిరంతరం చేపడుతున్నాం. ఆహ్లాదం అందించేందుకు పార్కులు నిర్మించాం. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్లో జరిగినన్ని పనులు మరెక్కడా జరుగలేదు.
-కర్నాటి కృష్ణ, కేఎంసీ కార్పొరేటర్