సత్తుపల్లి రూరల్, మే 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన పల్లెప్రగతి కార్యక్రమంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామం ప్రగతిపథంలో దూసుకుపోతుంది. గ్రామ పంచాయతీలో సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. పల్లెప్రకృతివనంలో మొక్కలు ఏపుగా పెరిగి ఎటుచూసినా హరితవనాలను తలపిస్తున్నాయి. గ్రామంలో అంతర్గత రహదారులు బీటీ, సీసీ రోడ్లుగా మెరిసిపోతున్నాయి. ఊరి శివారులో చెరువు పక్కన సుందరంగా నిర్మించిన వైకుంఠధామం ఆకట్టుకుంటోంది. అందులో ఏర్పాటు చేసిన శివుడు, కాటికాపరి విగ్రహాలు సైతం ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలోని రహదారుల పక్కన వేసిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతూ ఆహ్లాదకరంగా మారాయి. గంగారం పంచాయతీ పరిధిలో 4,600 జనాభా నివసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. రూ.22 లక్షలతో రైతువేదిక భవనం, రూ.12 లక్షలతో వైకుంఠధామం, మరో రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. పాత ఆర్అండ్బీ భవన సముదాయం వద్ద రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం అత్యంత సుందరంగా ఉంది. ఆహ్లాదాన్ని పంచుతుండడంతో గ్రామస్తులు మురిసిపోతున్నారు.
ఇంటింటికీ చెత్త బుట్టలు..
గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.15 లక్షలతో డ్రైనేజీలు, రూ.15 లక్షలతో కల్వర్టులు, రూ.4 లక్షలతో గ్రావెల్ రోడ్లు నిర్మించారు. మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలు అందుతున్నాయి. హరితహారంలో భాగంగా నర్సరీ పచ్చందాలు పంచుతోంది. గ్రామంలో వారం వారం శానిటైజేషన్ చేస్తున్నారు. రోడ్ల వెంట బ్లీచింగ్ చల్లుతున్నారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేరుచేసి సేకరించేందుకు ఇంటింటికి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. వీధుల్లో సిమెంటు డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు.
గ్రామంలో మౌలిక సదుపాయాలు..
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డు నిర్మించాం. అంతర్గత రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా తీర్చిదిద్దాం. ప్రతీ వారం పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా పంచాయతీకి వచ్చే నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేలా చొరవ చూపుతున్నాం.
-మందపాటి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్, గంగారం
పల్లె ప్రకృతి వనం అద్భుతం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గంగారం పల్లెప్రకృతివనం అద్భుతంగా ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో రకరకాల పూల, పండ్ల మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతోంది. ‘మన గంగారం’ స్వాగత బోర్డు అద్భుతం. పెద్ద గ్రామం కావడంతో అందరికీ సౌకర్యాలు అందేలా వైకుంఠధామం నిర్మాణం, డంపింగ్ యార్డు నిర్మించాం. రహదారి పక్కనే అద్భుతమైన పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో బాటసారులు, పర్యాటకులు కొద్దిసేపు ఆగి సేదదీరి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
-చిట్యాల సుభాషిణి, ఎంపీడీవో