సత్తుపల్లి, మే 13: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని ముందుకొచ్చారని, ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు సహకరించకుండా మిల్లుల తనిఖీ పేరుతో ఎఫ్సీఐ అడ్డుగా నిలుస్తోందని అన్నారు. పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కలెక్టర్తో చర్చించి నియోజకవర్గంలోని యాసంగి ధాన్యాన్ని సత్తుపల్లిలోని మిల్లర్లే దిగుమతి చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
గత సీజన్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోడౌన్కు తరలించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా సేకరణ ఆలస్యమవుతోందన్నారు. శనివారం మంత్రిగంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్ అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటైందన్నారు. ప్రత్యేక బృందాన్ని క్షేత్రస్థాయిలో దింపి ధాన్యం కొనుగోళ్లలో లోపాలను వెలికి తీసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ప్రతి గింజనూ మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ గాదె సత్యం, అమరవరపు కృష్ణారావు, రఫీ, మల్లూరి అంకమరాజు, దూదిపాళ్ల రాంబాబు, చిలుకుర్తి కృష్ణమూర్తి, మట్టా ప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.