కొణిజర్ల, మే 13: ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాలు వేదికలని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. అలాంటి సమావేశాలు సకాలంలో పూర్తయితేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. కాగా సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం సరిపడా లేక సమావేశాన్ని ఈ నెల 16కు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు.
స్థానిక సమస్యలపై చర్చించారు. సమావేశానికి సభ్యులు హాజరుకాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం శుభకార్యాలు అధికంగా ఉండడం వల్ల సభ్యులు హాజరుకాలేకపోయినట్లు అధికారులు వివరించారు. సభ్యులంతా సమావేశానికి సకాలంలో హాజరయ్యేలా అధికారులు చొరవ చూపాలని మధు సూచించారు. ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, వైస్ ఎంపీపీ డేరంగుల వెంకటరమణ, ఎంపీడీవో ఆర్.రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు వై.చిరంజీవి, పోట్ల శ్రీనివాసరావు, కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, దొడ్డపునేని రామారావు, బానోతు బాలాజీ, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కిలారు మాధవరావు, దొండపాటి లక్ష్మి పాల్గొన్నారు.