‘పల్లెల్లో పచ్చందాలు పరచుకోవాలి.. పరిశుభ్రంగా ఉండాలి.. అంటువ్యాధులు దూరం కావాలి.. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు ఉండాలి.. పల్లె వనాలు గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి.. ఆహ్లాదాన్ని పంచాలి.. వైకుంఠ ధామాల్లో అన్ని వసతులు ఉండాలి..’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ పథకాన్ని అమలు చేస్తున్నారు. అందుకోసం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు.. ప్రగతి నిధులతో ప్రస్తుతం పల్లెలు అభివృద్ధి బాట పట్టాయి.. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
ఖమ్మం, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధుల వరద కురిపిస్తున్నది. పల్లెలు పచ్చగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని భావించిన సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపమే మారింది. పారిశుధ్యం మెరుగుపడడంతోపాటు పచ్చదనం ఉట్టిపడేలా హరితహారాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, సురక్షితమైన మంచినీటిని అందించే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. గ్రామాభివృద్ధిలో సర్పంచ్తోపాటు ఎంపీటీసీ, వార్డు సభ్యులను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు గ్రామాలే.. అందుకే గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్ఛయంతో పని చేస్తున్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోలేదు.. కానీ తెలంగాణ పాడి పంటలతో తుల తూగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణబద్దులయ్యారు. దీనిలో భాగంగానే గ్రామాల సమాగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా నాలుగు విడతలుగా పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను గుర్తించి పూర్తి చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామాల్లో హరితహారంతో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు బలమైన పునాదులు వేశారు. జనాభా ధమాషా ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో పల్లె ప్రగతి పనులు గ్రామాల్లో చేపట్టారు. మొదటి విడత 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు, రెండో విడత 2020 జనవరి 2 నుంచి 12వరకు, మూడో విడత, నాలుగో విడత 2021 జూలై 1 నుంచి 7వరకు ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పల్లె ప్రగతి ప్రణాళికలో గుర్తించిన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నది. గ్రామ పంచాయతీల్లో గుర్తించిన పనులకు నిధులు మంజూరు చేస్తున్నారు. వసతుల కల్పనలో భాగంగా తాగునీరు కోసం మిషన్ భగీరథ పనులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, నియోజక వర్గాల అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాస్తున్నారు. వివిధ పథకాల ద్వారా సుమారు రూ.14.50 కోట్లను జిల్లాలోని 589 గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఈ నిధులు తోడుకావడంతో పల్లెలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పారిశుధ్యం, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఫాగింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేశారు. వారంలో మూడురోజుల పాటు దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. అన్ని పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 14 ఫైనాన్స్ కార్పొరేషన్, పీఎంఏజీవై(ఎసీఎస్పీ) వంటి పథకాలతోపాటు సర్పంచ్లకు గౌరవ వేతనాలు, పంచాయతీల సాధారణ నిధులు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు.
పల్లె పాలనలో ప్రగతి కాంతులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా పల్లెలో ప్రగతి కాంతులు విరజిల్లుతున్నాయి. గ్రామాల్లో తప్పనిసరిగా డంపింగ్యార్డు, వైకుంఠధామాలు, నర్సరీల పెంపకం తప్పనిసరి చేసింది. దీంతో జిల్లాలో ఏడాదిలో జరిగిన పాలనలో గ్రామాలు అభివృద్ధి వైపు దూసుకపోతున్నాయి. ఇప్పటివరకు 589 పంచాయతీల్లో డంపింగ్యార్డుల పనులు కొనసాగుతున్నాయి. వైకుంఠధామాల పనులు పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, డీఆర్డీఏ డ్వామా ద్వారా చేపడుతున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీల ద్వారా 2.64 కోట్ల మొక్కల పెంపకానికి కసరత్తు చేస్తున్నారు. పడావు పడిన సమస్యలను పరిష్కరించడంతోపాటు విద్యుత్తు సమస్యలు తీర్చడంలో పాలకవర్గాలు ఎంతో శ్రద్ధ వహించాయి.
పంచాయతీలకు నిధుల కొరత లేదు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి పెద్దపీఠ వేసింది. ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. వర్షాలు అధికంగా కురిసనప్పటికీ పల్లెల్లో జ్వరాలు రావడం లేదు. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, నర్సరీ ఏర్పాటుతో గ్రామాల స్వరూపాలే మారాయి.
-బెల్లం ఉమా, ఎంపీపీ, ఖమ్మం రూరల్
కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేయడం ఆనందదాయకం
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైన నిధు లు పుష్కలంగా కేటాయిస్తున్నారు. గ్రా మాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి సువర్ణ అవకాశం. ప్రధాన వీధుల్లో వే సిన కడియం మొక్కలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. గ్రామాలన్నీ ఆహ్లాద వాతావరణంతో ఫరిడవిల్లుతున్నాయి.
మాళోతు ప్రియాంక, జడ్పీటీసీ, రఘునాథపాలెం
బృందావనం ప్రకృతి వనం
హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన కిష్టారం పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు 50వేల మొక్కలతో పచ్చదనాన్ని పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీలో 7వేల జనాభా నివసిస్తుండగా.. పట్టణానికి 10కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్పంచ్ చెట్టుమాల రేణుకా ఈశ్వర్, గ్రామస్తుల ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీకి వెంచర్ రూపంలో వచ్చిన మరో ఎకరం స్థలంలో సైతం ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి గ్రామశివారులో పదెకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. నెల వ్యవధిలోనే రెండు ప్రకృతి వనాలు, వైకుంఠధామం, బృహత్ పల్లెప్రకృతి వనంలో 50వేలకు పైగా మొక్కలు నాటి వాటిని ఏపుగా పెరిగేలా సంరక్షించారు. రూ.41 లక్షలతో 10ఎకరాల విస్తీర్ణంతో ఎంతో అధునాతనంగా నిర్మించిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులన్నీ పూర్తిచేశారు.
మా గ్రామం రూపురేఖలే మారాయి
పల్లె ప్రగతి పనులతో మా గ్రామం రూపురేఖలే మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రణాళిక ప్రకారం డంపింగ్యార్డ్, సెగ్రిగేషన్, కంపోస్ట్ షెడ్డులను నిర్మించటంతో పాటు ట్రాక్టర్లు ఏర్పాటు చేయించారు. దీని ద్వారా పంచాయతీకి ఆదాయం కూడా వస్తున్నది. నెలకు దాదాపు రూ.2.50 లక్షలు వస్తున్నాయి. సీసీ రోడ్లకు కూడా నిధులు మంజూరయ్యాయి.
-కోటి అనంతరాములు, వెంకటాపురం సర్పంచ్