ఖమ్మం జిల్లాలో ఈ యాసంగి సీజన్లో గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గింది. మొత్తం లక్ష ఎకరాలు సాగవుతుండగా.. దీనిలో 53వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారు. ఇతర పంటల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.
-ఖమ్మం వ్యవసాయం
ఖమ్మం వ్యవసాయం, జనవరి 30: యాసంగిలో సాగు ఎట్టకేలకు లక్ష ఎకరాల మైలు రాయి దాటింది. ఏటా యాసంగి కేవలం వరి సాగు మాత్రమే 2.25 లక్షల ఎకరాలకు పైగా ఉండేది. ఈ సంవత్సరం కేవలం 40వేల ఎకరాలకు మాత్రమే పరితమితమైంది. జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా, చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉన్నది. వీటితో పాటు సాగర్ కాలువ ద్వారా నీరు వదిలే అవకాశమూ ఉన్నది. జిల్లాలోని 21 మండలాల్లో 16 మండలాలు సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా విస్తారంగా వరి సాగవుతుంది. కేంద్రం ధాన్యం కొనుగోలు ససేమిరా అనడంతో ఈ ప్రభావం ప్రస్తుతం సాగర్ ఆయకట్టుపై పడింది. ప్రస్తుతం జిల్లా రైతులు కేవలం ఇంట్లో తిండి గింజల కోసమే వరి పండిస్తున్నారు. దీంతో సాగు విస్తీర్ణం అమాంతం పడిపోయింది. ఏటా యాసంగిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా ఈసారి సీజన్ ముగుస్తున్నప్పటికీ లక్ష ఎకరాలకు మాత్రమే చేరింది.
నేటి వరకు సాగు వివరాలు..
గతేడాది యాసంగితో పోలిస్తే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తున్నది. యాసంగి సాగు పనులు ముగిసే సమయం వచ్చేసినప్పటికీ ఆశించిన మేర సాగు జరగలేదు. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల గణంకాల ప్రకారం ఇప్పటివరకు కేవలం 1,00,812 ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైంది. గత యాసంగి సీజన్లో ప్రధాన పంటగా వరి సాగు చేయగా రైతులు ఈసారి మక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ఈసారి మక్కలు 53,523 ఎకరాల్లో సాగవుతున్నది. వరి 40,226 ఎకరాలు, మినుము 914 ఎకరాలు, పెసర 1,499 ఎకరాలు, వేరుశనగ 1,653 ఎకరాలు, చెరుకు 1,291 ఎకరాలు, పొద్దుతిరుగుడు 100 ఎకరాలు, జనుములు 152 ఎకరాలు, ఇతర పంటలు మరో 500 ఎకరాల్లో సాగవుతున్నాయి. సాగు నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ సాగు అంతంతమాత్రంగానే ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సాగు విస్తీర్ణం తగ్గింది.