ఖమ్మం, జనవరి 27 : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్ జిల్లాగా మార్చడానికి కృషి చేస్తానని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా గురువారం రాత్రి ఖమ్మం నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ అధ్యక్షుడు కమర్తపు మురళీ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు తాతా మధుకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓపెన్టాప్ జీపులో పార్టీ కార్యాలయానికి చేరుకున్న తాతా మధు ముందుగా కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి ఉంచారని ఆయనకు జన్మజన్మల రుణపడి ఉంటానన్నారు. శుక్రవారం మంత్రి హరీశ్రావు పర్యటన ఉన్నందుకు ముందుగానే జిల్లాకు వచ్చానని త్వరలోనే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం లాంటిదని అందరికీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. రాబోవు రోజుల్లో పార్టీ కార్యాలయం ఉద్యమ, పరిపాలన, భరోసా ఇచ్చే కేంద్రంగా ఉంటుందని తాతా మధు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, బలుసు మురళీ కృష్ణ, మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, షకీనా, లింగాల రవికుమార్, సుడా డైరెక్టర్ కూసూరి రమేశ్గౌడ్, బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, ఇంటూరి శేఖర్, బానోతు శ్రీను, వివిధ మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.