రామవరం/కొత్తగూడెం క్రైం, మార్చి 25 : జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు మరో వేటగాడు బలయ్యాడు. సరదాగా స్నేహితులతో వేటకు వెళ్లిన ఆ వ్యక్తి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఉచ్చుకు తగిలిన వ్యక్తి అదృశ్యంకావడంతో పోలీసు బృందాలు జాగిలాలతో రంగంలోకి దిగి గాలింపుచర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సన్యాసిబస్తీకి చెందిన మల్లెల సునీల్కుమార్(48) తన స్నేహితులు దొంగల వెంకయ్య, లావుడ్యా మున్నాతో కలిసి గురువారం రాత్రి చుంచుపల్లి మండలంలోని పెనుబల్లి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. ఆ సమయంలో జంతువుల వేట కోసం వేరొకరు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగెలకు వెంకయ్య తగలడంతో విద్యుత్షాక్కు గురయ్యాడు. అతన్ని వెనక్కి లాగే క్రమంలో అదుపు తప్పి సునీల్ విద్యుత్ తీగెలపై పడడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారిగా భయానికి గురైన వెంకయ్య, మున్నాలు సునీల్ మృతిచెంది ఉంటాడని భావించి పరుగున టూ టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సీఐ లావుడ్యా రాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ సునీల్, వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగ కనిపించకపోవడంతో పై అధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ట్రైనీ ఐపీఎస్ క్రాంతిలాల్ పాటిల్, వన్టౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సునీల్ జాడ కోసం పోలీస్ జాగిలాలను రంగంలో దింపి స్థానికుల సాయంతో గాలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీస్ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వేటగాళ్లు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సునీల్ సజీవంగానే ఉన్నాడా, లేక విద్యుదాఘాతానికి గురవడంతో మృతదేహాన్ని ఉచ్చు వేసిన వేటగాళ్లు మాయం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ వెంకటేశ్వరబాబు పేర్కొన్నారు.