ఖమ్మం సిటీ, ఏప్రిల్ 21: ఆధునిక సమాజంలో ఎన్నో ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేర్గాంచిన ఆటలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాటిల్లో బాల్ బ్యాడ్మింటన్ ఒకటి. 1990వ దశకం వరకు పాఠశాల స్థాయిలో కనిపించి ఆహ్లాదాన్ని పంచిన ఈ క్రీడ జాడ ప్రస్తుతం లేదు. ఇలాంటి సందర్భంలో ఇదే ఆటకు ప్రాణం పోయాలని భావించింది జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఈ నెల 23, 24 తేదీల్లో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు తెలుగు రాష్ర్టాల స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించనున్నది. దీనిలో భాగంగా 28 జట్లతో పాటు రైల్వేస్కు చెందిన ఈస్టర్న్, సౌత్జోన్ జట్లకు ప్రత్యేక ఆహ్వానం పంపింది. పోటీలు డే అండ్ నైట్ ప్లడ్ లైట్ల మధ్య జరుగనున్నాయి. టోర్నమెంట్తో బాల్ బ్యాడ్మింటన్కు పూర్వవైభవం వస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టోర్నమెంట్ను విజయవంతం చేయాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నన్నక బాబు, గౌరవాధ్యక్షులు డాక్టర్ ఆర్,రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి బడేసాబ్ కోరారు. గురువారం సాయంత్రం పటేల్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12,500, రూ.10వేలతో పాటు జ్ఞాపికలు అందజేస్తామన్నారు. విజేతలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ చీఫ్ అడ్వయిజర్ టీఆర్సీ రాజు, ఉపాధ్యక్షులు ఆనందరావు, శేషగిరిరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్, సహాయ కార్యదర్శులు జమలయ్య, డీఎస్ శశి కళాధర్, కోశాధికారి ఎన్.రామమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.