మామిళ్లగూడెం, ఫిబ్రవరి 23 : ఎస్సీ వసతి గృహాల్లో 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థుల మెస్ చార్జీలను వసతిగృహ సంక్షేమాధికారులు డ్రా చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్సీ కులాల అభివృద్ధి శాఖాధికారులకు ఎస్సీ అభివృద్ధిశాఖ రాష్ట్ర సహాయ సంచాలకురాలు ఉమాదేవి మెమోలను జారీ చేశారు. ఇది ఈ నెల 2వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా అధికారులకు వాటిని డ్రా చేసిన వసతిగృహ సంక్షేమాధికారులకు మెమోలు జారీ అయ్యాయి.
2020-21 విద్యా సంవత్సరంలో కొవిడ్ రెండో దశ ఉధృతితో ప్రభుత్వం విద్యాసంస్థలను ఆలస్యంగా ఫిబ్రవరిలో ప్రారంభించింది. దీంతో మొదటిరోజు నుంచి 9, 10తరగతుల విద్యార్థులను వసతి గృహాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. అయితే ఫిబ్రవరిలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన జరగలేదు. మార్చి 25వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించారు. మార్చి 15వ తేదీ వరకు వసతిలోకి అనుమతించాలని ఎస్సీ శాఖ నుంచి రాత పూర్వకంగా సర్యులర్ రాలేదు. మార్చి 16వ తేదీ తర్వాత అన్ని తరగతులను అనుమతించాలని సంక్షేమ శాఖల్లో అధికారులు ఆదేశించారు. జిల్లాలోని మూడు ప్రీ మెట్రిక్ వసతిగృహాలు మినహా అన్ని వసతి గృహాల్లో నిబంధనలకు విరుద్ధంగా మెస్ చార్జీలను డ్రా చేసినట్లు ఏడీ ఇచ్చిన మెమోలో పేరొన్నారు. వసతిగృహ సంక్షేమాధికారులు మాత్రం నాడు అధికారులు ఇచ్చిన మౌఖిక ఆదేశాలకు అనుగణంగానే వసతిలోకి 6, 7, 8 తరగతుల విద్యార్థులను అనుమతించామని పేరొంటున్నారు. విద్యార్థి సంఘాలు మాత్రం అసలు విద్యార్థులను తీసుకోకుండానే నిధులు డ్రా చేసి మింగేశారని ఆరోపిస్తున్నాయి.
తిమ్మరావుపేట ఎస్సీ పాఠశాల స్థాయి వసతిగృహంలో మార్చి 24కు రెండోవిడత లాక్డౌన్ ప్రకటించగా, 28వ తేదీ వరకు విద్యార్థులకు హాజరు వేసి మెస్చార్జీలను డ్రా చేసి అవినీతికి పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్ను కోరారు.
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో 39 మంది వసతి గృహ సంక్షేమాధికారులకు మెమోలు జారీ చేశాం. కొవిడ్ సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు మెస్ బిల్లులు డ్రా చేశారనే ఫిర్యాదులు అందడంతో అధికారులను వివరణ కోరాం. విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకుంటాం.
-కస్తాల సత్యనారాయణ, ఖమ్మం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ