ఖమ్మం, ఏప్రిల్ 7: రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా ఆయన ఎండగట్టారు. 2021-22లో వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్డీఆర్ఎఫ్) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఆ నిధుల నివేదికను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి పువ్వాడ.. అందులో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని ప్రస్తావించారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచారని, కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుండడంతో మనసు కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వమే వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నదని గుర్తుచేశారు. వరదల్లో అల్లాడిపోయిన తెలంగాణకు తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు, రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవ్వాలని ప్రధానికి సీఎం కేసీఆర్ గతంలోనే లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు.