తిరుమలాయపాలెం, మార్చి 25: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ ఇచ్చిన పిలుపును శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ అధిష్ఠానం పిలుపులో భాగంగా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో శుక్రవారం నిర్వహించిన పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతులపై వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష వైఖరికి నిరసనగా శనివారం నుంచి నుంచి 30 వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రమే కొనేలా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, డీసీసీబీలు, సొసైటీల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు వివరించారు. నాయకులందరూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు.
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ‘నా వ్యక్తిత్వం ప్రకారం నేను ఎవరికీ హానిచేసే వ్యక్తిని కాదు. నా గురించి ఒక్కరు చెడుగా మాట్లాడినా తట్టుకోలేను. నియోజకవర్గ ప్రజల కష్టాసుఖాల్లో పాలుపంచుకునేందుకే ఆర్థిక సహాయం అందజేస్తున్నా. దానిని కొనసాగిస్తా.’ అని అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపితానికి కృషిచేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేపట్టే ఉద్యమాలను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరావు, టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, ఎంపీపీలు బోడ మంగీలాల్, బెల్లం ఉమ, బానోత్ శ్రీను, వజ్జ రమ్య, జడ్పీటీసీలు వరప్రసాద్, ఇంటూరి బేబి, డీసీసీబీ డైరెక్టర్లు చావా వేణు, ఇంటూరి శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.