సత్తుపల్లి, జనవరి 13: ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ జయప్రదం కోసం శుక్రవారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశ మందిర ఆవరణను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ నేతృత్వంలో మహిళలు రంగవల్లులను తీర్చిదిద్దారు. తొలుత భోగి మంటలు వేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ సంప్రదాయ పద్ధతిలో రంగవల్లులను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీటితోపాటు గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారులకు భోగిపళ్ల వేడుకలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర ప్రముఖులు వీక్షించారు. సంక్షేమ పథకాల రంగ వల్లులు, కేసీఆర్ చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతర మంత్రి హరీశ్రావు చిన్నారుల తలలపై భోగిపళ్లు పోసి వారిని ఆశీర్వదించారు. తొలుత భోగి మంటలు వెలిగించి ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. ధాన్యం రాశి ముందు ఏర్పాటు చేసిన కేసీఆర్ కటౌట్కు పుష్పాభిషేకం చేశారు. అనంతరం హరిదాసులకు కానుకలు సమర్పించారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.