కరకగూడెం/ మణుగూరు టౌన్, డిసెంబర్ 19: పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, అందిస్తున్న పాలనకు ఆకర్షితులై ఆ పార్టీకి చెందిన నేతలు చాలామంది ఇదివరకే బీఆర్ఎస్లోకి రాగా.. తాజాగా మరికొంత మంది చేరారు. కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం సహా ఆ మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, మదర్సాహెబ్, సోమరాజు, కుడితిపూడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డితోపాటు మరికొంత మంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. వాటికి ఆకర్షీతులమయ్యే తాము బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ మండల నాయకులు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, ఎలిపెద్ది శ్రీనివాసరెడ్డి, ఎల్లు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.