రఘునాథపాలెం, డిసెంబర్ 12: నిరుపేదల సొంతింటి కలను డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్ఆర్నగర్లోని డబుల్ బెడ్రూం ఇళ్లను పొందిన లబ్ధిదారులకు సోమవారం పట్టా సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు ధరలు అమాంతం పెరిగాయన్నారు. డబుల్ బెడ్రూం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.20 లక్షల విలువైన సొంతింటికి పేదలను హక్కుదారులను చేసిందని వివరించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని అన్నారు. ఇప్పుడు పేదలు అందుకుంటున్న పట్టా సర్టిఫికెట్లు భవిష్యత్తు తరాలకు ఆస్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ హక్కు పత్రాలను తాకట్టు పెట్టవద్దని, కార్పొరేషన్లో వచ్చే ఇంటి పన్నును క్రమం తప్పకుండా చెల్లించి పూర్తి హక్కుదారులుగా ఉండాలని సూచించారు.
52 మంది నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు..
రఘునాథపాలెం గ్రామానికి చెందిన 52 మంది అసైన్డ్ భూములను కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రైతులు 8 ఏళ్ల క్రితం భూములును కోల్పోయి నిర్వాసితులుగా ఉన్నారు. వీరికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఒక్కో ఎకరానికి 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేశారు. వీటిని వైఎస్ఆర్ నగర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా మంత్రి రైతులకు స్వయంగా అందజేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, దేవభక్తుని కిశోర్బాబు, కొణకంచి వరప్రసాద్, మందనపు నరేశ్, వాంకుడోతు సురేశ్, మోహన్, అజ్మీరా వెంకన్న, లక్ష్మి, ప్రభావతి, భుక్యా భాషా పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం నగరం సమగ్రాభివృద్ధి జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలో పర్యటించిన ఆయన.. రూ.1.35 కోట్లతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 25వ డివిజిన్ అజరయ్యనగర్లో రూ.45 లక్షలతో నిర్మించే మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. 27వ డివిజన్ శ్రీనివాసనగర్లో రూ.45 లక్షలతో, 52వ డివిజన్ బుర్హాన్పురంలో రూ.45 లక్షలతో నిర్మించే సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు ఆర్జేసీ కృష్ణ, మక్బూల్, గోళ్ల చంద్రకళ, బుర్రి వెంకటేశ్వరరావు, కర్నాటి కృష్ణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.