భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలోని సర్కారు ఆసుపత్రుల్లో సరికొత్త సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ వైద్యం మన్యానికి మరింత చేరువైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. దీంతో ప్రజలు సుఖంగా, ఆనందంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల గ్రామాల ప్రజలకు సైతం వైద్యసేవలు సకాలంలో అందుతున్నాయి. గతంలో భద్రాచలం ఏజెన్సీ పరిధిలో గర్భిణులు ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రావాల్సి వచ్చేది. పినపాక, జానంపేట, కరకగూడెం, గుండాల నుంచి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సమస్యకు చరమగీతం పలికింది తెలంగాణ సర్కారు. నిన్నమొన్నటి వరకు అక్కడ గైనకాలజిస్టులు లేరు.. సర్జరీలూ జరుగలేదు. కానీ ఇప్పుడు మణుగూరు ప్రభుత్వాసుపత్రిలో డెలివరీలతోపాటు సర్జరీలు కూడా జరుగుతున్నాయంటే అది రాష్ట్ర ప్రభుత్వ చొరవే అవుతుంది. అనతికాలంలోనే ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు, బూర్గంపాడు ఆసుపత్రుల పడకల స్థాయి పెరిగింది. జిల్లాలో మణుగూరు ఆసుపత్రి 100 పడకలు కాగా, ఇల్లెందు 30, అశ్వారావుపేట 30, బూర్గంపాడు 30, పాల్వంచ 50 పడకల ఆసుపత్రులుగా రెడీ అయ్యాయి. త్వరలో చర్ల, జూలూరుపాడు ఆసుపత్రులు అప్గ్రేడ్ కానున్నాయి. దీంతో ఎక్కడి ప్రజలకు అక్కడే వైద్యసేవలు పక్కాగా అందుతుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభంకావడంతోపాటు జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రి డీఎంఈకి అనుసంధానం కావడంతో ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించడానికి సర్కారు దృష్టి సారించింది. దీంతో కలెక్టర్ అనుదీప్ ఏరియా ఆసుపత్రులను అప్గ్రేడ్ చేసి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అక్కడ ఆసుపత్రులకు నిధులు మంజూరు చేయించి ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించుకున్నారు. దీంతోపాటు కలెక్టర్ కూడా నిధులను కేటాయించడంతో ఏరియా ఆసుపత్రులు అప్గ్రేడ్ అయ్యేందుకు దోహదపడింది. దీనివల్ల పురాతన భవనంలా ఉన్న ఇల్లెందు ఆసుపత్రి కొత్త హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది. మణుగూరు ఆసుపత్రిని ఆధునీకరణ చేయడంతోపాటు ప్రత్యేక వైద్యనిపుణలు, గైనిక్ వైద్యులను నియమించడంతో సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 16మందికి సర్జరీలు చేశారు. ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు ఆసుపత్రులకు అక్కడి ఎమ్మెల్యేలు రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. దీంతో ఆసుపత్రుల్లో సర్జరీ థియేటర్లు ప్రారంభానికి నోచుకున్నాయి. బూర్గంపాడు ఆసుపత్రికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు రూ.2.7 కోట్లు నిధులను ప్రత్యేకంగా కేటాయించారు.
నిధులు కేటాయించిన ఎమ్మెల్యేలు..
ఆయా ప్రాంతాల్లో ఆసుపత్రుల అభివృద్ధికి అక్కడి ఎమ్మెల్యేలు నిధులు కేటాయింపులు చేయడంతో ఆసుపత్రుల అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు ఆసుపత్రికి రూ.75 లక్షలు, బూర్గంపాడు ఆసుపత్రికి రూ.2.70 కోట్లు కేటాయించారు. ఇల్లెందు ఆసుపత్రికి ఎమ్మెల్యే హరిప్రియ రూ.35 లక్షలు కేటాయించారు. అశ్వారావుపేట ఆసుపత్రికి ఎమ్మెల్యే రూ.35 లక్షలు కేటాయించారు.
కొత్తగా 37మంది వైద్యుల నియామకం..
మారుమూల ప్రాంతాలకు వైద్యులు రావాలంటే చాలామంది ఇష్టత చూపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మన్యానికి వైద్యసేవలు అందించాలనే పట్టుదలతో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యులను ఒప్పించారు. దీంతో జిల్లాలో 37మంది వైద్యులు కొత్తగా విధుల్లో చేరారు. అందులో 8మంది ప్రసూతి వైద్యులు ఉండడం గమనార్హం. గైనిక్ వైద్యులు రూ.లక్ష వేతనానికి మన్యంలో పనిచేసే అవకాశం లేకపోవడంతో అదనంగా మరో లక్ష రూపాయలు ఇచ్చేలా కలెక్టర్ అనుదీప్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్, డీసీహెచ్ఎస్ చేసిన కృషిని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అభినందించారు.
త్వరలో చర్ల, జూలూరుపాడు అప్గ్రేడ్..
మారుమూల ప్రాంతాలకు మరింత వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉన్న రెండు పీహెచ్సీలను కూడా వైద్యవిధాన పరిషత్లోకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కలెక్టర్ అనుదీప్ రూ.1.40 లక్షల నిధులను కేటాయించి మెటర్నరీ వార్డును మంజూరు చేశారు. ఇద్దరు వైద్యులను కూడా నియమించారు. దీంతోపాటు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా ప్రత్యేక వైద్యులతోపాటు సర్జరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు.
రోగికి పునర్జన్మ ఇస్తే ఎంతో తృప్తి
ఆపదలో ఉన్న రోగికి పునర్జన్మ ఇస్తే అందులో ఉన్న తృప్తి ఎక్కడా ఉండదు. పేదలకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. భద్రాద్రి జిల్లా వాసిగా ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నా. కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులను నియమించాం. రానున్నరోజుల్లో జిల్లాలోని ఆసుపత్రును మరింత అభివృద్ధి చేసుకుంటాం.
– డాక్టర్ రవిబాబు, డీసీహెచ్ఎస్
అందుబాటులో టిఫా సేవలు
ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి సామాన్యుడు ఆర్థిక ఇబ్బంది పడకూడదు. అందుకే సర్కారు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. ఎంసీహెచ్లో టిఫా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు ఉచితంగా జరుగుతున్నాయి. ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరుకు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశాం. రక్త నిధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. వైద్యుల కొరత లేదు. సిబ్బంది కొరతను అధిగమిస్తున్నాం. చర్ల, జూలూరుపాడు ఆసుపత్రులను త్వరలో అప్గ్రేడ్ చేస్తాం.
– దురిశెట్టి అనుదీప్, కలెక్టర్