కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 3: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ వినీత్ గంగన్న వివరాలు వెల్లడించారు. చర్ల మండలంలోని ఎర్రంపాడు అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ల జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఐదుగురు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన జవాన్లు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా నిమ్మలగూడేనికి చెందిన వెడమ భీమయ్య, సోడి మూయ, పోడియం అడమయ్య, నగేశ్, జట్టపాడుకు చెందిన మడకం నగేశ్గా గుర్తించారు. వీరు రెండేళ్ల నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన విప్లవ సంఘం (ఆర్పీసీ) సభ్యులుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గతేడాది పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా జవాన్లను టార్గెట్ చేస్తూ చర్ల మండలంలోని రామచంద్రాపురం అటవీ ప్రాంతంలో బూబీట్రాప్స్ ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకులు అప్పగించిన పనులు చేస్తూ వీరు పోలీసులకు పట్టుబడ్డారు. సమావేశంలో ఓఎస్డీ సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అదనపు కమాండెంట్ కమల్వీర్ యాదవ్, 81 బెటాలియన్ అదనపు కమాండెంట్, చర్ల సీఐ బొడ్డు అశోక్కుమార్ పాల్గొన్నారు.
ఏపీలో ఇద్దరు మావోయిస్టులు..
మావోయిస్టు పార్టీకి చెందిన దళ మహిళా డిప్యూటీ కమాండర్తో పాటు ఓ పార్టీ సభ్యుడు శనివారం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అల్లూరి జిల్లా ఎస్పీ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుంట మండలం బెజ్జింగిరామ గ్రామానికి చెందిన కొవాసీ పొజ్జి 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. పార్టీ డిప్యూటీ దళ కమాండర్గా ఎదిగింది. ఇదే జిల్లాలోని పాడిమేరుకు చెందిన మడివి శంకర్ అలియాస్ సోమిదళ్ 2013లో పార్టీ మిలీషియా సభ్యుడిగా చేరాడు. ఎల్వోఎస్ సభ్యుడిగా ఎదిగాడు. వీరిద్దరూ మావోయిస్ట్ పార్టీ ఆదేశాల మేరకు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలపై విసిగిన పొజ్జి, సోమిదళ్ జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.