మణుగూరు టౌన్, నవంబర్ 22: మణుగూరు 100 పడకల దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించి మాట్లాడారు. త్వరలో డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యంపై దృష్టి సారించారన్నారు. ప్రజలు వైద్యసేవలను వినియోగించుకోవాలన్నారు.
అనంతరం కలెక్టర్ వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి గిరిప్రసాద్, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.