ఖమ్మం/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 9: తెలంగాణ విభజన అవమానకరంగా జరిగిందంటూ ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఖమ్మం దద్దరిల్లింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అధ్యక్షతన ఖమ్మం నగరంలో బుధవారం నిర్వహించిన నిరసనకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ విషం కక్కుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, తాజుద్దీన్, చుంచు విజయ్కుమార్, డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ సాగింది. రఘునాథపాలెం మండలంలో టీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో నిరసనలు తెలియజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ ఆధ్వర్యంలో రఘునాథపాలెంలోని జంకలతండా క్రాస్ రోడ్డు వద్ద ఇల్లెందు ప్రధాన రహదారిపై బైఠాయించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రధాని మోదీ అక్కసు వెళ్లగక్కారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు కుర్రా భాస్కర్రావు, గుత్తా రవికుమార్, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వరరావు, భుక్యా లక్ష్మణ్నాయక్, ధరావత్ రామ్మూర్తినాయక్, పొట్లపల్లి రాజా, మెంటెం రామారావు, తాతా వెంకటేశ్వర్లు, బండి నాగేశ్వరరావు, తొలుపునూరి దానయ్య, లక్పతినాయక్, గంగిరెడ్డి విజయ్రెడ్డి, గుగులోతు శ్రీను, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీను, జాఠోతు సూర్య, మొగిలిశెట్టి నరేశ్, తుమ్మలపల్లి మోహన్రావు, రాంచందర్, గుగులోతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.