ఖమ్మం సిటీ, మార్చి 22: మాతా, శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల అమలులో ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి పేర్కొన్నారు. నాన్ కొవిడ్ ఆరోగ్య అంశాలపై మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంతకాలం సమీక్షా సమావేశాలు జరుపలేదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. క్షయ వ్యాధి నివారణలో ఖమ్మం జిల్లాకు బ్రాంజ్ మెడల్ రావడం అభినందనీయమన్నారు. పథకం వచ్చేలా కృషిచేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్మూలనలో సమష్టి కారణంగానే జిల్లాకు కాంస్య పతకం వచ్చిందన్నారు. ఇక ముందు కూడా ఇదే నిబద్ధతతో ముందుకు సాగుదామన్నారు. గర్భిణుల నమోదు, నాలుగు చెకప్లు, సాధారణ ప్రసవాలపై పీవో ఎంసీహెచ్ డాక్టర్ సైదులు సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలని సూచించారు. పీవో (సీహెచ్ఐ) డాక్టర్ రాజేశ్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో మూడు రోజులపాటు రివ్యూ జరిగిందన్నారు. సూపర్వైజర్లు రోజుకు 10 పీహెచ్సీల పనితీరుపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎంవో డాక్టర్ సంధ్య, డిఫ్యూటీ డెమో జీ సాంబశివారెడ్డి, నీలోహన తదితరులు పాల్గొన్నారు.