ఖమ్మం రూరల్, మే 12: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్నికల బందోబస్తుకు హాజరవుతున్న పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున భద్రతాపరమైన అన్ని చర్యలూ పకడ్బందీగా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంలు తిరిగి స్ట్రాంగ్రూములకు వచ్చే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 230 క్రిటికల్ పోలీంగ్ స్ట్రేషన్లలో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీస్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే నేర చరితులను ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆరు కంపెనీల కేంద్ర బలగాల సిబ్బందితోపాటు 2,391 పోలీస్లు, టీఎస్పీఎస్ బెటాలియిన్ సహా వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు వివరించారు. మద్యం, నగదు అక్రమ రవాణా అయ్యే అవకాశం ఉన్నందున పోలింగ్కు రెండురోజుల ముందు నుంచే కమిషనరేట్ పరిదిలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.99.94 లక్షల గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు. ట్రైనీ ఐపీఎస్ మౌనిక, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సీఐ రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.