ఖమ్మం :నిబంధనలు అతిక్రమించి బాణాసంచా విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నగరంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాలను మంగళవారం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలని అన్నారు.
పండుగ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో 100 కాల్ చేయాలని సూచించారు. బాణాసంచా దుకాణదారులు అగ్నిప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, టౌన్ ఏసీపీ అంజనేయులు, సిఐలు శ్రీధర్, అంజలి పాల్గొన్నారు.