అన్ని రంగాల్లో ఖమ్మం అగ్రభాగంలో ఉన్నదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్రంలోనే ఖమ్మం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వీవీపాలెంలోని జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తరువాత రూ.వేల కోట్ల నిధులతో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 18న నలుగురు సీఎంల సమక్షంలో నూతన కలెక్టరేట్ను ప్రారంభించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఖమ్మం వేదిక కావడం గర్వకారణమని అన్నారు. ఎస్సీల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు మంత్రి అజయ్కుమార్తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. వేడుకల్లో జిల్లా జడ్జి టి.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుసూదన్, స్నేహలత, ఎమ్మెల్యే సండ్ర తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నింటి ఖమ్మమే అగ్రశ్రేణిలో ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అన్ని జిల్లాలకంటే ముందంజలో ఉందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. నలుగురు సీఎంల సమక్షంలో నూతన కలెక్టరేట్ను ప్రారంభించుకోవడం గొప్ప విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన వినూత్న పథకాలను అమలు చేసుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందన్నారు.
74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీవీపాలెంలోని జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ వీపీ గౌతమ్ గురువారం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం స్వయం పరిపాలన కోసం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యంగం ఫలితంగానే 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా అవతరించిదని గుర్తుచేశారు. దాని ఫలితమే ఈ గణతంత్ర వేడుకలని వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత రూ.వేల కోట్ల నిధులతో జిల్లాలో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఈ నెల 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ మన జిల్లా అభివృద్ధికి నిధులు ప్రకటించారని వివరించారు.
ఖమ్మం వేదికగా ‘కంటి వెలుగు’..
సర్వేంద్రియానాం నయనం ప్రధానమని తలచిన రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. రెండో విడత కంటి వెలుగు ప్రారంభోత్సవానికి ఖమ్మం వేదిక కావడం గర్వకారణమని అన్నారు. జిల్లాలో 55 బృందాల ద్వారా 15,81,782 మందికి స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి నాణ్యమైన కళ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 100 రోజులపాటు కొనసాగే కార్యక్రమంలో దృష్టిలోపం ఉన్న వారికి తగిన చికిత్సలు అందిస్తామన్నారు.
దళితబంధుతో ఎస్సీల సాధికారత..
ఎస్సీల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. స్వయం ఉపాధికి చేయూతనందించి ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశమని అన్నారు. పైలట్ ప్రాజెక్టు అయిన చింతకాని మండలంలో రూ.346.20 కోట్లతో 3,462 యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. 5 నియోజకవర్గాల్లో 483 యూనిట్లను రూ.48.30 కోట్లతో గ్రౌండింగ్ చేసినట్లు వివరించారు.
‘ధరణి’తో పారదర్శకత..
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల నమోదు కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శకత, జవాబుదారీతనం అమలవుతున్నాయన్నారు.
రైతుబంధుతో పంటల పెట్టుబడి..
పంటలకు పెట్టుబడి లేక అన్నదాతలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ పథకం కింద ఈ యాసంగిలో ఇప్పటి వరకు 3,02,057 మంది రైతులకు రూ.295.74 కోట్లను అందించినట్లు వివరించారు. రైతుబీమా కింద 2022లో ఇప్పటి వరకు 298 క్లయిములకు గాను రూ.14.90 కోట్ల పరిహారాన్ని అందించినట్లు చెప్పారు.
స్కూళ్లలో సౌకర్యాల కోసం ‘మన బడి’
పాఠశాల విద్యలో మరింత ప్రగతిని సాధించేందుకు, సర్కారు బడులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. మొదటి విడతగా 2021-22 సంవత్సరంలో 426 పాఠశాలలో కార్పొరేటుకు దీటుగా మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.135 కోట్లతో వెచ్చించామన్నారు. ఈ కార్యక్రమ అమలులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగంలో ఉందన్నారు.
సీఎంల సమక్షంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం..
పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని నిర్మించినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. రూ.53.20 కోట్లతో రఘునాథపాలెం మండలం వీవీ పాలెంలో ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేసుకున్నామన్నారు. ఈ నెల 18న మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్తోపాటు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించుకోవడం గర్వకారణమని అన్నారు.
జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు మంత్రి అజయ్కుమార్తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. సత్వర న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తున్న పోలీస్ కమిషనర్, జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న అధికారులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, కేఎంసీ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ రాధికాగుప్తా, అదనపు డీసీపీ శబరీశ్, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సుందరంగా ఖమ్మం నగరం..
సీఎం కేసీఆర్ వాగ్దాన నిధులతో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రూ.100 కోట్లతో గోళ్లపాడు చానల్ను ఆధునీకరించినట్లు చెప్పారు. అనంతరం ఈ కాలువ వెంట పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి అక్కడి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. వాటికి తెలంగాణ వైతాళికులు ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్బాపూజీ, కాళోజీ నారాయణరావు, మంచికంటి కిషన్రావు, ఎండీ రజాబ్అలీ, పద్మశ్రీ వనజీవి రామయ్యల పేర్లు పెట్టుకున్నట్లు వివరించారు.