కొణిజర్ల, డిసెంబర్ 15: విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. మండలంలోని పెద్దగోపతి, గుబ్బగుర్తి, రామచంద్రాపురం, తీగలబంజర ప్రభుత్వ పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, హాజరు విధానం, సమయ పాలన, డ్రాపౌట్స్ తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పెద్దగోపతిలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పెద్దరామపురంలో గోద్రేజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమాధాన్ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ మొక్కలు నాటారు. కంపెనీ ద్వారా రైతులకు అందుతున్న సబ్సిడీలు, ఇతర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. భూసార పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సర్పంచ్ మీర్జారోషన్బేగ్, జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీటీసీ దొడ్డపునేని నాగమణి, ఎంఈవో శ్యాంసన్, టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీను, పాసంగులపాటి శ్రీను, విజయ్ పాల్గొన్నారు.
మండలంలోని పెద్దగోపతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ వీపీ గౌతమ్ టీచర్గా మారి పాఠశాలలోని 6వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించారు. ముదిగొండ కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్ కుమార్తె ఉనికి అనే విద్యార్థిని తాను దాచుకున్న రూ.లక్షతో పాఠశాలకు కంప్యూటర్లు బహూకరించారు. ఈ కంప్యూటర్ రూమును కలెక్టర్ గురువారం ప్రారంభించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. సర్పంచ్ డానియేలు, ఎంపీటీసీ రమాదేవి, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.