మామిళ్లగూడెం, డిసెంబర్ 12: మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వారు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని ఆకాంక్షించారు. అలాగే, మహాలక్ష్మి పథకం మహిళలకు వరంలాంటిదని అన్నారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలపై స్వయం సహాయక సంఘ సభ్యులకు ఖమ్మంలోని టీటీడీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని అన్నారు. వయసు, ఆర్థిక భేదాలు లేకుండా మహిళలందరూ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. చదువు, నైపుణ్యం ఉండి సొంత ఊరిలో సరైన ఉపాధి లభించక దూర ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉపాధి పొందాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే, చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లో 115 రకాల పరీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులు విద్యాచందన, సీహెచ్ వెంకన్న, సుమ, మాలతి, సుహాసిని పాల్గొన్నారు.
అసెంబ్లీ సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించారని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఐడీవోసీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయా అధికారుల అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులను సమర్థంగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు. వచ్చే ఎన్నికలను ఇంకా బాగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర అధికారులు ఆదర్శ్ సురభి, మయాంక్ సింగ్, సిద్ధార్థ్ విక్రమ్సింగ్, గణేశ్, అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ‘జాతీయ రహదారులు, ఇరిగేషన్, మూడో రైల్వేలైన్ భూసేకరణ, పనుల పురోగతి’పై ఆయా శాఖల అధికారులతో ఐడీవోసీలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు గణేశ్, అశోక్ చక్రవర్తి, దుర్గాప్రసాద్, శ్రీనివాసులు, నాయుడు, శ్యాంప్రసాద్, యుగందర్, సాలెంరాజు, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.