మామిళ్లగూడెం, ఏప్రిల్ 10 : పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కేటాయించిన విధులను నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నామినేషన్ సహాయక కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని, ఇందుకు సంబంధించి సామగ్రి, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ప్రింటెడ్, బ్లాక్ నామినేషన్ పత్రాలన్నింటినీ సరిచూసుకోవాలన్నారు. 85 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, ఎస్సెన్షియల్ సర్వీసెస్లో పనిచేసే వారు ఫారం 12,12ఏ తీసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించిన వారికి తిరిగి అవకాశం ఇవ్వాలని సూచించారు. మే 3వ తేదీ నుంచి హోమ్ ఓటింగ్ చేపట్టాలన్నారు. సెగ్మెంట్లలో ఈవీఎంలు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు, పోస్టల్ బ్యాలెట్లు భద్రపరచడానికి మండల స్థాయిలో భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ యువరాజ్, డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్సింగ్, అదనపు డీసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, ఏప్రిల్ 10 : పల్లె దవాఖానల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వీ వెంకటాయపాలెం పల్లె దవాఖానను బుధవారం తనిఖీ చేసిన ఆయన ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా మందులు ఇవ్వాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలు ఎంత మంది పిల్లలకు ఇచ్చారు? ఇంకా ఎంత మందికి ఇవ్వాలి? అనే దానిపై ఆరా తీశారు. పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, డాక్టర్ బాలకృష్ణ, ఏఎన్ఎం పుష్పలత ఉన్నారు.