ఖమ్మం, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం సీపీ సునీల్దత్తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం లోక్సభా స్థానం పరిధిలో జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, భద్రాద్రి జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నారు.
లోక్సభా ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఇదే రోజు నుంచి ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇదే నెల 25వ చివరి తేదీ ఆఖరు అన్నారు. 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. మే 13న ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఇదే నెల 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘనల ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుదారులు సి-విజిల్ యాప్లోనూ ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించారు. యంత్రాంగం వెంటనే రాజకీయపరమైన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలన్నారు.
గోడలపై ఉన్న పొలిటికల్ పబ్లిసిటీ రాతలపై అక్షరాలు కనపడకుండా పెయింట్ వేయాలన్నారు. కోడ్ అమలును ఫ్లయింగ్ స్వాడ్స్, ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎంసీఎంసీ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు. నామినేషన్ల స్వీకరణకు 10 రోజుల ముందు వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహాలు, హెలీప్యాడ్, ప్రభుత్వ మైదానాలను ఫస్ట్ కమ్ ఫస్ట్కి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల యాజమాన్యలు విద్యార్థులకు సి-విజిల్ యాప్పై అవగాహన కల్పించాలని సూచించారు.
సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఫ్లయింగ్ స్వాడ్ బృందలో ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, పోలీస్, వీడియో గ్రాఫర్లు ఉంటారన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సందేశాలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజలు సరైన ధ్రువపత్రాలతో నగదు తరలించాలన్నారు. సరైన పత్రాలు లేకుండా నగదును సీజ్ చేస్తామన్నారు.
రూ.50 వేలకు పైగా నగదుకు పత్రాలు తప్పనిసరి అన్నారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా, రెవెన్యూ, ఇన్కం ట్యాక్స్, సేల్స్ట్యాక్స్ డిపార్టుమెంట్ల సమన్వయంతో రాష్ట్ర, అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆధారాలు లేకుండా సీజ్ అయిన నగదు విషయమై అప్పీల్, దరఖాస్తు కోసం కలెక్టరేట్లోని మొదటి అంతస్థులో జిల్లా వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి కార్యాలయాలను సంప్రదించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్నాయక్, జడ్పీ సీఈవో వినోద్, శిక్షణ ఐఏఎస్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణ ఐపీఎస్ మౌనిక, డీపీఆర్వో గౌస్ పాల్గొన్నారు.