ఖమ్మం సిటీ, ఏప్రిల్ 2 : 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో ఖమ్మంలో 5 కే రన్ నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియం వద్ద కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్నాయక్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, నగర ప్రముఖులు, యువతీ యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని 5కే రన్ విజయవంతం చేశారు.
పటేల్ స్టేడియం నుంచి బయలుదేరి లకారం పార్కు వరకు పరుగెత్తగా.. ప్రతిభ కనబరిచిన నలుగురికి కలెక్టర్ గౌతమ్ నగదు బహుమతిని అందజేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 14వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. సీ విజిల్ యాప్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తక్షణమే డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఓటరు హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఓటు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ మయాంక్ సింగ్, యువరాజ్, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, డీవైఎస్వో తుంబూరి సునీల్రెడ్డి, టేబుల్ టెన్నీస్ కోచ్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.