ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఖమ్మం జిల్లాలో ‘తొలిమెట్టు’ అమలు తీరు, సాధించిన ఫలితాలపై కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా ప్రధానోపాధ్యాయులతో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి.. ‘తొలిమెట్టు’లో ఇంకా ప్రగతి సాధించాలని సూచించారు. గురువారం ఖమ్మం నియోజకవర్గపరిధిలోని హెచ్ఎంలతో సమావేశం కానున్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్7 : ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకాలిక లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించింది. వెనుకబడిన విద్యార్థులపై దృష్టికేంద్రీకరించి మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. విద్యాశాఖ మండల అధికారి నుంచి అడిషనల్ డైరెక్టర్స్ వరకు పర్యవేక్షిస్తున్నది. అయితే కలెక్టర్ వీపీ గౌతమ్ తొలిమెట్టుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెల 2వ తేదీన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి తొలిమెట్టుపై ఇంకా ప్రగతి సాధించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. బుధవారం వైరా, సత్తుపల్లి నియోజకవర్గ ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించగా.. గురువారం ఖమ్మం నియోజకవర్గ పీఎస్, యూపీఎస్ హెచ్ఎంలతో సమావేశం కానున్నారు.
విద్యార్థులెవరూ వెనుకబడి ఉండకూడదు. తేలికపాటి సామర్థ్యాలను విద్యార్థులు సాధించకపోతే ఎలా అనే అంశాలను కలెక్టర్ పరిగణలోకి తీసుకుని ప్రధానోపాధ్యాయులతోనే నేరుగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత ప్రధానోపాధ్యాయులను మోటివేట్ చేస్తే లక్ష్యాలను చేరుకోగలమనే ప్రాతిపదికన సమీక్షలు జరుగనున్నాయి. లక్ష్య సాధనలో లోపం ఎక్కడుంది.? ప్రణాళిక అమలులో ఎందుకు విఫలమవుతున్నారు.? తదితర వివరాలను ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకోనున్నారు. నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయడంతోపాటు రెగ్యులర్ సిలబస్ను పూర్తి చేయడంపై సమీక్షలో చర్చించనున్నారు. ఏ తరగతివారైనా సరే లక్ష్యాలు సాధించినవారిని, సాధించనివారిని విడివిడిగా గ్రూప్స్ చేయాలి. ఒక్కొక్క టీచర్ గ్రూప్ను దత్తత తీసుకుని మెరుగైన సామర్థ్యాల సాధనకు కృషి చేయాలని నోడల్ ఆఫీసర్లు, ఎంఈఓలకు సూచించారు.
ఎస్ఏలో కొంతమెరుగ్గా..
కరోనా అనంతరం విద్యార్థుల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు తరగతులవారీగా మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనపై ప్రభుత్వం దృష్టిసారించింది. 2022-23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు వార్షిక ప్రణాళిక, యూనిట్, పాఠ్యప్రణాళిక, రోజువారీ పీరియడ్ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలనకు మండల, క్లస్టర్ పరిధిలోప్రధానోపాధ్యాయులు, రిసోర్స్పర్సన్లను నియమించింది. తాజాగా తొలిమెట్టుపై పర్యవేక్షణ పెంచిన ప్రభుత్వం కమిటీలను రూపొందించాలని స్పష్టం చేసింది. జాయింట్ డైరెక్టర్స్, అడిషనల్ డైరెక్టర్స్ కూడా జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 44 వేల మంది విద్యార్థులను తొలిమెట్టులో భాగస్వామ్యం చేస్తున్నారు. విద్యాశాఖ ప్రారంభం నుంచే కార్యక్రమం నిర్వహిస్తుండటంతోపాటు ప్రమాణాల స్థాయిని తెలుసుకునేందుకు స్పెషల్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహించారు. వీటితోపాటు ఇటీవల నిర్వహించిన సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని విద్యాశాఖాధికారులు గుర్తించారు. 1వ తరగతిలో 7,906 మంది, 2వ తరగతిలో 9,669 మంది, 3వ తరగతిలో 8,082 మంది, 4వ తరగతిలో 10,207మంది, 5వ తరగతిలో 8,433 మంది విద్యార్థులు తొలిమెట్టులో తెలుగు, గణితం, ఇంగ్లిష్లో కొంతమెరుగ్గా రాణించారు.
నియోజకవర్గాల వారీగా సమీక్షలు..
ఈ నెల 7, 8వ తేదీల్లో నియోజకవర్గాల వారీగా ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షించనున్నారు. బుధవారం ఉదయం వైరా నియోజకవర్గ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, సాయంత్రం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో తొలిసారి కలెక్టర్ సమావేశమై మోటివేట్ చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు లక్ష్యం చేరుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం నియోజకవర్గపరిధిలోని ప్రధానోపాధ్యాయులందరికీ డీపీఆర్సీ బిల్డింగ్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల మూడో వారంలో మధిర, పాలేరు నియోజకవర్గపరిధిలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.