కల్లూరు/ వైరా టౌన్, డిసెంబర్ 7 : తరగతి గదిలో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరులోని జూనియర్ కళాశాల, వైరా రైతువేదికలో నియోజకవర్గస్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మౌలిక భాషాగణిత సామర్థ్యాల సాధనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 18మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రతి ఐదు కిలోమీటర్లకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రతి రెండు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది తొలిమెట్టు, మన ఊరు/ మన బస్తీ – మన బడి కార్యక్రమాల ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో ఆధునీకరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు తరగతి గదిలో చిట్టచివరి విద్యార్థి సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ర్యాంకులతోపాటు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించేందుకు వినూత్నంగా ఉపాధ్యాయులు ఆలోచించాలని సూచించారు. విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని సూచించారు. తద్వారా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో ర్యాంకులు సాధించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యా సామర్థ్యాలను పూర్తిస్థాయిలో నేర్పించాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో తొలిమెట్టు కార్యక్రమంపై సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్లూరు సమావేశంలో ఏఎంవో రవికుమార్, ఎంఈవోలు బి.రాములు, సీహెచ్ వెంకటేశ్వర్లు, దామోదర ప్రసాద్తోపాటు కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైరాలో ఎంఈవోలు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, మోదుగు శ్యామ్సన్, దుగ్గిరాల జయరాజు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.