ఖమ్మం రూరల్, జూన్ 4 : రాబోయే సీజన్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు త్వరగా చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గోళ్లపాడులో గురువారం జరిగిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభలు ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేరడానికి, సమస్యలు పరిష్కరించే వేదికలు కావాలన్నారు. వర్షాకాలం వస్తున్నందున నీటి పారుదల ఉన్న కాల్వల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, ఆయిల్పాం, కూరగాయలు, పండ్ల తోటలు ఎక్కువగా సాగు చేసి రైతులు లాభాలు గడించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, మురుగు కాల్వల్లో వ్యర్థాల తొలగింపు విషయంలో గ్రామపంచాయతీలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు.
జిల్లాలో సమగ్ర విపత్తు నివారణ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణం సరిగా లేకపోతే భవిష్యత్ తరాలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగిపోతాయనే అపోహలు వద్దని, ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫాంలు అందజేస్తారని తెలిపారు. జూలై 31న ఓట్ల తుది జాబితా రూపొందిస్తారని, ఇందులో అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, ఆత్మ పీడీ సరిత, వ్యవసాయాధికారి ఉమా నగేశ్, మండల అధికారులు పాల్గొన్నారు.