ఖమ్మం, డిసెంబర్ 28: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి యావత్ రాష్ర్టానికే ఆదర్శమని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అంధత్వం లేని రాష్ర్టాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం జనవరి 18 నుంచి రెండో విడత ‘కంటి వెలుగు’ను ప్రారంభిస్తున్నదన్నారు. కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాక్సినేషన్ను విజయవంతం చేసిన విధంగానే కంటి వెలుగును విజయవంతం చేయాలన్నారు.
నగరంలో చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. సిటీకీ సరిపడా ఇంక్యూలేటర్స్ సమకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరించేందుకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో బల్క్ జనరేటర్స్ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కౌన్సిల్ 11 అంశాలకు ఆమోదం తెలిపింది. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పోరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి పాల్గొన్నారు.
మరింత అభివృద్ధి సాధిద్దాం.. ఎంపీ నామా నామా నాగేశ్వరరావు
సమన్వయంతో పని చేసి నగరంలోని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాడి రూపాయలు విడుదల చేసిందన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే సాధ్యమైందన్నారు. ఎంపీగా తాను ఖమ్మం అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నానని అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ర్టాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సభ్యులకు సూచించారు. నగరంలోని సారథినగర్ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన కోర్ట్ కేసు సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్నారు.