కాలచక్రం గిర్రున తిరిగింది. చూస్తుండగానే రోజులు, నెలలు గడిచిపోయాయి.. 2022 కాలగమనంలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. వెళ్తూవెళ్తూ ఉమ్మడి జిల్లా ప్రగతికి బాటలు వేసింది. సంక్షేమం వెల్లివిరిసింది. అభివృద్ధికి కేరాఫ్గా మలిచింది. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి, పార్టీ పదవుల్లో జిల్లాకు పెద్దపీట వేశారు. పట్టణాలు స్వచ్ఛ అవార్డులను కైవసం చేసుకున్నాయి. కీలక రాజకీయాలకు వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగ నామ సంవత్సరంగా నిలిపింది. యువతలో నూతనోత్సాహం నింపింది. అంతేకాదు, ఎందరో ప్రముఖులు జిల్లాలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు సింగరేణి ఆతిథ్యమిచ్చింది. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఆయా క్రీడల్లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన రెండు హత్య కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇలా 2022 సంవత్సరం ఎన్నో మధురానుభూతులతోపాటు విషాదాలను మిగిల్చింది. – ఖమ్మం, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ రోజుతో 2022 సంవత్సరం పూర్తి కానున్నది. మరికొది గంటల్లో 2023 సంవత్సరం ప్రవేశించనున్నది. నూతన ఏడాదికి ప్రజలంతా స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. ఇదే ఒరవడిలో 2022లో ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రధాన ఘట్టాలు, స్మృతులు, జ్ఞాపకాలు, రాజకీయ పరిణామాలు, విషాదాలు, అభివృద్ధి, సంక్షేమం.. ఇలా అన్ని విషయాలను ఒకసారి నెమరువేసుకుందామా..!
దళితబంధు పథకానికి చింతకాని మండలం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైంది. దీనిలో భాగంగా మండలవ్యాప్తంగా 3,440 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరూ రూ.10 లక్షల విలువైన యూనిట్లు పొందారు. మిగిలిన నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిపొందారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 7,371 మంది, షాదీముబారక్ ద్వారా 346 మంది రూ.3.46 కోట్ల విలువైన చెక్కులు అందుకున్నారు. జిల్లావ్యాప్తంగా 4,790 మంది డబుల్ బెడ్రూం ఇండ్లు పొందారు.
రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది 3,07,620 మంది రైతుల ఖాతాల్లో రూ. 355.43 కోట్లు జమయ్యాయి. వివిధ కారణాలతో 612 మంది రైతులు మృతి చెందగా ఒక్కో నామినీ ఖాతాలో రూ.5 లక్షల చొప్పున రైతుబీమా రూ.3.60 కోట్లు జమయ్యాయి. ఇక సాగు విషయానికొస్తే ప్రభుత్వం 2,94,986 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించింది. రెవెన్యూ అధికారులు 80శాతం ధరణి దరఖాస్తులను పరిష్కరించారు. హరితహారంలో భాగంగా యంత్రాంగం 1.13 కోట్ల మొక్కలు నాటింది. జిల్లా వ్యాప్తంగా 754 పంచాయతీల పరిధిలో రూ.11.06 కోట్లతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 13.31 లక్షల మొక్కలు పెరుగుతున్నాయి. అలాగే ఐదు బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో వేలాది మొక్కలు ఎదుగుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా 969 గ్రామాలకు శుద్ధజలం సరఫరా అవుతున్నది.
సీఎం కేసీఆర్ సహకారంతో ఖమ్మం నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇప్పటికే సీఎం అనేక సభల్లో ఇతర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల నిజామాబాద్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా వీక్షించారు. నగర మాడల్ను నిజమాబాద్లో అమలు చేస్తామని వెనుదిరిగారు. ఈ ఏడాది నగర నడిబొడ్డున నాలుగెకరాల స్థలంలో నూతన కార్పొరేషన్ భవనం అందుబాటులోకి వచ్చింది. నగర కార్పొరేషన్ కార్యాలయం సిటీ లైబ్రరీగా రూపాంతరం చెందింది. రూ.4 కోట్లతో లకారం ట్యాంకు బండ్ సుందరీకరణ పూర్తయింది. రూ.93.70 లక్షలతో జడ్పీ సెంటర్ నుంచి ఐటీ హబ్ వరకు ఫుట్పాత్ జోన్ అందుబాటులోకి వచ్చింది. లకారం ట్యాంక్బండ్పై రూ.8.75 కోట్లతో కేబుల్ బ్రిడ్జి, మరో రూ.2 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్ అందుబాటులోకి వచ్చింది. 34 ప్రదేశాల్లో పబ్లిక్ టాయ్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. దానవాయిగూడెంలో రూ.5.48 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కర్మాగార నిర్మాణం పూర్తయింది. నగరపాలకసంస్థ పారిశుధ్య నిర్వహణకు రూ.1.73 కోట్లతో 10 ట్రాక్టర్లు, 15 ఆటోలు కొనుగోలు చేసింది. రూ.9 కోట్లతో 25,520 ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసింది. రూ.35 కోట్లతో 6.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు, 9.6 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది.
మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పదవీకాలం ఈ ఏడాది జనవరి 4న ముగిసింది. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు తాతా మధుసూదన్ గతేడాది డిసెంబర్ 14 ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా గెజిట్ మాత్రం ఈ ఏడాది జనవరి 5న విడుదలైంది. ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర, హెటిరో డ్రగ్స్ అధినేత, వేంసూరుకు చెందిన బండి పార్థసారథిరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. 23న వద్దిరాజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాగా, మే 27న పార్థసారథిరెడ్డి ఎన్నికయ్యారు. వీరు మే 30న ఎంపీలుగా ప్రమాణం స్వీకారం చేశారు. కొన్నిరోజుల తర్వాత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
భద్రాద్రి జిల్లాలోని గోదావరి నుంచి ఖమ్మం జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సీతారామప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే 47,381 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. కాలువల నిర్మాణానికి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 1,717 ఎకరాల భూసేకరణ అవసరమైంది. దీనిలో అధికారులు ఇప్పటికే 1,570 ఎకరాలకు పరిహారం ప్రకటన విడుదలైంది. అలాగే భద్రాచలం- సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి జిల్లాలో 308 ఎకరాల భూసేకరణ పూర్తయింది. సూర్యాపేట -ఖమ్మం నాలుగు రోడ్ల జాతీయ రహదారి విస్తరణకు 306 ఎకరాల భూసేకరణ, రూ.1,039 కోట్లతో ఖమ్మం- కోదాడ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ, ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్కు లైన్కు రూ.687 కోట్లతో భూసేకరణ ప్రక్రియ పూర్తయింది.
ఖమ్మం నుంచి వైరా వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వం రూ.53.20 కోట్ల వ్యయంతో 20.10 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ నిర్మించింది. నిర్వాసితులకు ఒక్కో ఎకరానికి రూ.కోటి చొప్పున పరిహారం అందించింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకున్నారు.
పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులను అప్రమత్తం చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు. ఇదే కాక నేరాల నియంత్రణ, కట్టడిలోనూ పోలీస్శాఖ కీలకంగా వ్యవహరించింది. కానీ ఆగస్టు 15న రూరల్ మండలంలోని తెల్దారుపల్లిలో డీసీసీబీ డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య హత్య ఒక్కసారిగా పోలీస్శాఖను ఉలిక్కిపడేలా చేసింది. కేసును సీరియస్గా తీసుకున్న సీపీ కొద్దిరోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఏడాదిలో జరిగిన గ్రూప్-1, కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నారు. గంజాయి, గుట్కా రవాణా అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఇలా కేసుల కన్విక్షన్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపారు. ఇటీవల ఖమ్మం నగరంలో పూజల పేరుతో నగదు తీసుకుని ఉడాయించిన దొంగ బాబాను కేవలం రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ పథకం అమలు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అమలు చేయనున్నది. ‘మన ఊరు-మన బడి’ తొలివిడతకు జిల్లావ్యాప్తంగా 426 స్కూల్స్ ఎంపికయ్యాయి. ఇప్పటికే 70 స్కూల్స్లో అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ గురుకులాల్లో స్కూల్స్ను ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా 12 బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. రఘునాథపాలెం బీసీ గురుకులంలో డిగ్రీ కోర్సులూ అందుబాటులోకి వచ్చాయి. 1- 5వ తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘తొలిమెట్టు’ అమలు చేస్తున్నది. కలెక్టర్ వీపీ గౌతమ్, విద్యాశాఖ అధికారులు నిరంతరం కార్యక్రమాన్ని పరిశీలించి విజయవంతం చేస్తున్నారు.
రఘునాథపాలెం మండలంలో రూ.14.90 కోట్ల నిధులతో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములు నిర్మించింది. దీంతో రైతులు తాము పండించిన పంటను గోదాముల్లో దాచుకునే వెసులుబాటు కలిగింది. ఇక నుంచి రైతులు పంట ధరలు మార్కెట్లో తక్కువ పలికినప్పుడు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంటను దాచుకునే అవకాశం ఉంది.
జిల్లాపరిధిలోని వ్యవసాయ మార్కెట్లకు నిర్దేశించిన లక్ష్యాలకు మార్కెట్లు చేరువయ్యాయి. ఖమ్మం, నేలకొండపల్లి, మద్దులపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏన్కూరు, సత్తుపల్లి మార్కెట్ల నుంచి సెస్ ద్వారా ఈ ఏడాది రూ.36.57 కోట్ల ఆదాయం సాధించాలని రాష్ట్ర మార్కెటింగ్శాఖ లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటికే మార్కెట్లు రూ.25.19 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు లక్ష్యాన్ని అధిగమించనున్నాయి. ఖమ్మం ఏఎంసీ లక్ష్యం రూ.17.61 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.16.43 కోట్లు, మధిర ఏఎంసీ లక్ష్యం రూ.4.05 కోట్లు కాగా రూ.2.21 కోట్లు, నేలకొండపల్లి మార్కెట్ లక్ష్యం రూ.4.05 కోట్లు కాగా రూ.64.18 లక్షలు, కల్లూరు మార్కెట్ లక్ష్యం రూ.1.48 కోట్లు కాగా రూ.81.78 లక్షలు, వైరా మార్కెట్ లక్ష్యం రూ.2.25కోట్లు కాగా రూ.1.05 కోట్లు, ఏన్కూర్ మార్కెట్ లక్ష్యం రూ.2.55 కోట్లు కాగా రూ.2.47 కోట్లు, సత్తుపల్లి మార్కెట్ లక్ష్యం రూ.2.72 కోట్లు కాగా రూ.62.61 లక్షలు, మద్దులపల్లి మార్కెట్ లక్ష్యం రూ.1.85 కోట్లు కాగా రూ.92.68 లక్షల ఆదాయాన్ని ఆర్జించాయి.