ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 21 : సకల సౌకర్యాలకు నెలవైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొన్నేళ్లుగా అగ్నిమాపక సేవలు అందుబాటులో లేవు. ఏడాదంతా అన్నదాతలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించి తెచ్చిన పంటలు ప్రమాదపుటంచున ఉంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగానో, ఏమరుపాటుగానో ఎటునుంచైనా పొరపాటున అగ్గిపడితే ఆ పంటలన్నీ బుగ్గిపాలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రధాన సమస్య కర్షకులను కలవరపెడుతోంది. సీజన్ వచ్చిన ప్రతిసారీ అటు అధికారులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం ఏఎంసీ ఒకటి. ప్రస్తుతం ఇక్కడ పూర్తి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. పంట ఉత్పత్తులకు అనుగుణంగా మిర్చి, అపరాలు, పత్తి పంటల కోసం వేర్వేరు యార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఖమ్మంతోపాటు పొరుగున ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులు ఏడాది పొడవునా ఇక్కడికి తమ పంటలను తెచ్చి విక్రయిస్తుంటారు. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ ఖమ్మం ఏఎంసీలో అగ్నిమాపక కేంద్రం అందుబాటులో లేదు. మిర్చి సీజన్లో అన్నదాతలను ఈ సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
మార్కెట్కు వచ్చే పంటకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 2010లో అప్పటి పాలకవర్గం మార్కెట్లో అగ్నిమాపక సేవలు అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించింది. మార్కెట్ కమిటీ స్థలంలోనే రూ.50 లక్షల వ్యయంతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం సుమారు రూ.55 లక్షలతో నూతన అగ్నిమాపక వాహనాన్ని కొనుగోలు చేశారు. 2015లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నూతన అగ్నిమాపక కేంద్రాన్ని, వాహనాన్ని ప్రారంభించారు. దీంతో రైతులు ఊరట పొందారు. కానీ.. తాము చెల్లించిన రూ.55 లక్షల మొత్తానికి కొత్త వాహనాన్ని కాకుండా వినియోగించిన వాహనాన్ని అగ్నిమాపక శాఖ ఇచ్చిందంటూ ఏఎంసీ బాధ్యులు దాన్ని తిరస్కరించినట్లు తెలిసింది. అలాగే.. వాహన సిబ్బంది కూడా అగ్నిమాపక శాఖ విశ్రాంత ఉద్యోగులు కావడం, వారికి ఏఎంసీ బాధ్యులు అంతటి అధిక వేతనాలు ఇవ్వలేకపోవడం వంటి కారణాలతో వారు కూడా విధులకు రాకపోవడం వంటివి జరిగినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
కాగా.. ఇక్కడి అధికారులు, పాలకవర్గ బాధ్యులు ఖమ్మం ఏఎంసీలో ఈ ఐదేళ్లలో సుమారు ఐదుసార్లు అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. రైతు సంఘాల బాధ్యులు, వ్యాపారుల ఒత్తిడి మేరకు పాలకవర్గ బాధ్యులు ప్రతిసారీ ఏదో ఒక అగ్నిమాపక వాహనాన్ని తేవడం, ఆ తరువాత అది వెళ్లిపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. అయితే ఏటా డిసెంబర్ నుంచి సీజన్ ప్రారంభం కావడంతో పత్తి, మిర్చి పంటలు మార్కెట్కు పోటెత్తుతాయి. దీనికితోడు మార్కెట్కు సమీపంలోనే దాదాపు పది కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. పొరపాటున ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు నేలకొండపల్లి నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపు పంటంతా బూడిదైన విషయం విదితమే. ప్రాథమిక నివారణ కోసం పత్తి యార్డులో చిన్నపాటి అగ్నిమాపక యంత్రాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి తక్కుపట్టిపోయాయి.
ఖమ్మం ఏఎంసీకి రైతులు తీసుకొచ్చే పంటలకు పూర్తి భద్రత కల్పిస్తాం. సాధారణంగా సీజన్లో అగ్నిమాపక శాఖ నుంచి అదనపు వాహనాన్ని తెప్పించి సిద్ధంగా ఉంచుతాం. సీజన్ అనంతరం తిరిగి అప్పగిస్తాం. అయితే ఖమ్మం ఏఎంసీలో కొనుగోలు చేసిన వాహనం తదితర విషయాలను అధికారుల ద్వారా తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. వాహన సమస్య గురించి అగ్నిమాపక శాఖతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం.