ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారం బుధవారం మార్కెట్ ప్రాంగణంలో జరగనున్నది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరుకానున్నారు. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించారు. ఉదయం చైర్పర్సన్ తన చాంబర్లో పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అమాత్యులకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఖమ్మం వ్యవసాయం, జనవరి 31 : రాష్ట్ర మార్కెటింగ్శాఖకే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మణిహారంగా నిలిచింది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులకు పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు ప్రధాన కేంద్రమైంది. ఖమ్మం మార్కెట్ ఆన్లైన్ సేవల్లో జాతీయస్థాయి మార్కెట్లతో పోటీ పడుతున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఈ-నామ్, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-టామ్ విధానం క్రయవిక్రయాల్లో మొదటిదశ ప్రక్రియ విజయవంతంగా అమలు అవుతున్నది. రైతలకు సేవలు అందించడంతోపాటు మార్కెట్కు ఆదాయం సమకూర్చుకోవడంలోనూ టార్గెట్ రీచ్ అవుతున్నది.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్కు జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులే కాకుండా పొరుగు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీ లోని కృష్ణా నుంచి ప్రతి రోజూ వందలాది మంది రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఖమ్మం మార్కెట్కు తీసుకొస్తుంటారు. సీజన్లో పంటలు చేతికొచ్చిన సమయంలో ప్రతిరోజూ ఏడు వందల నుంచి 1-2 వేల మందికి పైబడి రైతులు మార్కెట్కు వస్తుండటం గమనార్హం.
ఈ-నామ్లో ఖమ్మం ఏఎంసీ భేష్
ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ఈ -బిడ్డింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చిన ఖమ్మం మార్కెట్ నాటి నుంచి నేటి వరకు సాంకేతిక పరిజ్ఞానంలో సత్తా చాటుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ మార్కెట్ విధానం(ఈ-నామ్) మొదటి దశ విధానం 2016 అక్టోబర్ పత్తి, అపరాల క్రయవిక్రయాల్లో ప్రారంభమైంది. అనంతరం అపరాల క్రయవిక్రయాల్లోనూ అమలు చేశారు. దీంతో స్థానిక ఖరీదుదారులు ఈ-నామ్ మొదటి దశకు సంబంధించి ఆన్లైన్లో బిడ్ చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పంటను అమ్ముకున్న రైతులకు ఆన్లైన్ తక్పట్టీల జారీ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు అయ్యింది.
ఉపాధి కేంద్రంగా వ్యవసాయ మార్కెట్
ఉమ్మడి జిల్లా పరిధిలో 14 వ్యవసాయ మార్కెట్లలో అన్ని మార్కెట్లకు తలమానికంగా, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్లకే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ-వ్యవసాయ మార్కెట్లో ప్రత్యక్షంగా దాదాపు 2 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరో 700 మంది వ్యాపారస్తులు ఈ మార్కెట్ను నమ్ముకొని లబ్ధి పొందుతున్నారు. వీరితోపాటు కూరగాయల మార్కెట్లో 143 మంది హమాలీలు 106 మంది కార్ట్సుమ్యాన్ వ్యవసాయ మార్కెట్లో విధులు నిర్వహిస్తున్నారు. మరో 300 మంది వ్యాపారులున్నారు. మొత్తంగా దాదాపు 3,500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మార్కెట్ను నమ్ముకొని జీవిస్తుండటం గమనార్హం. మార్కెట్ మొదట్లో వంద నుంచి 2 వందల మందితో ప్రారంభమైన మార్కెట్ ఉద్యోగులతో కలిపి ఈ రోజు వరకు సుమారు 4 వేల కుటుంబాలకు ఉపాధి కేంద్రంగా మారింది.
నేడు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారం నేడు మార్కెట్ ప్రాంగణంలో జరగనున్నది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరుకానున్నారు. ఆయా కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ఉదయం చైర్మన్ తన చాంబర్లో పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత ఆమాత్యులకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఏఎంసీని ప్రథమస్థానంలో నిలపడమే ప్రధాన కర్తవ్యం
వ్యవసాయ మార్కెట్ను ద్వితీయ స్థానం నుంచి ప్రథమ స్థానానికి చేర్చడమే నా ప్రధాన కర్తవ్యం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దశాబ్దాల చరిత్ర ఉంది. పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తాను. దశాబ్దకాలంగా ప్రజాజీవితంలో ఉన్నాను. సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నగర వ్యవసాయ మార్కెట్, త్రీటౌన్ ప్రాంతంపై అవగాహన ఉంది. కొద్ది రోజుల్లోనే క్రయవిక్రయాల ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకుంటాను.
– దోరేపల్లి శ్వేత, చైర్పర్సన్, ఖమ్మం ఏఎంసీ