ఖమ్మం: జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించామని, రైతులు గందరగోళానికిన గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబార్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను గురించి ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో డీసీఎంఎస్, ఐకేపీ(డీఆర్డీఏ), ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. గత వానాకాలం, యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన విధంగా ఈ వానాకాలం సీజన్లోనూ ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 11,9, 657 హెక్టార్లలో వరి సాగు చేశారని ఈ ఏడాది సుమారు 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ దిగుబడి వచ్చిన ధాన్యంలో స్థానిక అవసరాలకు పోను ప్రభుత్వం 3లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 245 ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అవసరమైతే వాటిని ఆయా కొనుగోలు కేంద్రాలు నిర్వహించే శాఖలు అదనంగా ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేశామని తెలిపారు.