రూ.1.43 కోట్ల విలువైన మిరప విత్తనాలు స్వాధీనం
44 మందిపై కేసు నమోదు
వివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్
నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలపై దాడులు
ఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రభుత్వ అనుమతులు, లైసెన్స్ లేకుండా ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంతో పాటు పలుచోట్ల నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.1.43 కోట్లు విలువ చేసే విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్.వారియర్ వివరాలు వెల్లడించారు. ఏన్కూరుకు చెందిన బైరు వేణుగోపాల్రావు, మంగయ్య గత నెల 17వ తేదీన ఇదే గ్రామానికి చెందిన ముదిగొండ వెంకటకృష్ణారావు అనే రైతు వద్దకు వెళ్లి తమ వద్ద నాణ్యమైన విత్తనాలు ఉన్నాయని నమ్మబలికారు. వెంకటకృష్ణారావుకు ద్వారక సీడ్స్లో స్టార్ బిందు ఎఫ్- 1 హైబ్రిడ్ రకానికి చెందిన విత్తనాల ప్యాకెట్ ఒకటికి రూ.2 వేల చొప్పున విక్రయించారు. ఈ నెల 8న వెంకటకృష్ణారావు తాను కొనుగోలు చేసిన విత్తనాలను ఏన్కూరు వ్యవసాయ అధికారి(ఏవో) నరసింహారావు వద్దకు వెళ్లి నాణ్యతను పరిశీలించమన్నాడు. అధికారి వాటిని పరిశీలించి ఆ విత్తనాలకు అనుమతులు లేవని తేల్చారు. దీంతో ఏవో విత్తనాలు విక్రయించిన బైరు వేణుగోపాల్రావు, మంగయ్యపై విత్తన నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
బైరు వేణుగోపాల్రావును అరెస్టు చేసి విచారించిన పోలీసులు మరో నిందితుడు మంగయ్యనూ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మోసపూరిత మాటలతో ఖమ్మం నగరంలోని 20 విత్తన దుకాణాలకు విత్తనాలు సరఫరా చేసినట్లు తెలుసుకున్న అధికారులు నగరంలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఓ దుకాణంలో తనిఖీలు నిర్వహించి యజమాని వేగినాటి భాస్కర్రావును అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్రావు దుకాణంలో మిర్చి, పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే మరో 19 మంది విత్తన దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 7న ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి శివారులో నకిలీ విత్తనాలు తయారీ చేస్తున్న కుంచపు వెంకన్న, వల్లపు శ్రీనివాస్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 240 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
బోనకల్లు, రఘునాథపాలెం మండలాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. వీటన్నింటి విలువ రూ.1.43 కోట్లు ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 44 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఏన్కూరులో నకిలీ విత్తన దందా గుట్టు రట్టు చేసిన కల్లూరు ఏసీపీ వెంకటేశ్, సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సుభాశ్చంద్రబోస్, టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజం, సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్ తదితరులు ఉన్నారు.