రఘునాథపాలెం, జనవరి 17: దేశం యావత్తూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు పేర్కొన్నారు. దేశం అబ్బురపడేలా ఖమ్మం సభను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన.. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేత, సురేశ్రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్లతో కలిసి సభా వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో సభ ఉంటుందని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అజెండాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తామన్నారు. ఖమ్మం సభ దేశానికి దిక్సూచిగా మారుతుందన్నారు. అనంతరం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం భారీ బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 లక్షల పైచిలుకు జనం తరలిరానున్నట్లు తెలిపారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఖమ్మంలో జరిగే సభ దేశ రాజకీయాల్లో పెనుమార్పులను ఆవిష్కరిస్తుందని అన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.