ఖమ్మం, డిసెంబర్ 2: రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేస్తారని తెల్చి చెప్పారు. ఖమ్మంలోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఖమ్మం మమత ఆసుపత్రి ఆవరణలోని తన నివాసంలో శనివారం నిర్వహించిన నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒకరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వారి మనసులు గెలుచుకొని మనం మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. మొదటిసారి కూడా కేవలం 63 సీట్లతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లు గుర్తుచేశారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని, తెలంగాణను అస్థిరపరచడానికి ఎందరో ప్రయత్నించారని అన్నారు. కానీ కేసీఆర్ అలాంటి కుట్రలను ఛేదించి సువిశాల పాలన అందించారని గుర్తుచేశారు. రెండోసారి ఎన్నికల్లోనూ రాష్ర్టాన్ని విఫల తెలంగాణగా చిత్రీకరించాలని కుట్రలు చేశారని ఆరోపించారు.
కానీ ప్రజలందరూ బీఆర్ఎస్నే ఆశీర్వదించి 88 సీట్లు అందించారని గుర్తుచేశారు. తొలిసారి గెలిచిన అనంతరం శాసనసభలో నిరంతర విద్యుత్ అందిస్తామని కేసీఆర్ చెప్పారని, రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అదే సభలో ఉన్న అప్పటి కాంగ్రెస్ నేత జానారెడ్డి కల్పించుకొని సీఎం కేసీఆర్ ప్రకటనలు ఆచరణ సాధ్యం కాదంటూ అపహాస్యం చేసిన సందర్భం రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తే ఉందని అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే తాను గులాబీ జెండా కప్పుకొని బీఆర్ఎస్కు అనుకూలంగా ప్రచారం చేస్తానని కూడా అన్నారని గుర్తుచేశారు. ఆ తరువాత కేసీఆర్ ప్రకటనలు, హామీలు నూరుశాతం అమలయ్యాయయని గుర్తుచేశారు. కానీ గులాబీ కండువా కప్పుకుంటానన్న వాళ్లు మాయమయ్యారని విమర్శించారు. అదే నిరంతర విద్యుత్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని అన్నారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో, అందునా కొత్త రాష్ట్రంలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు మరెకడా లేవని అన్నారు. జీడీపీలో కూడా తెలంగాణది అగ్రస్థానమని స్పష్టం చేశారు. పంటల సాగు, ధాన్యం కొనుగోలు, ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, పింఛన్లు సహా అనేక పథకాలు అందిస్తున్నది సీఎం కేసీఅర్ మాత్రమేనని వివరించారు. అందుకే మళ్లీ గెలిచేది మనమేని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.